TS News : చికిత్స పొందుతూ హోంగార్డు రవీందర్ మృతి.. డీఆర్డీవో వద్ద హైటెన్షన్
ABN , First Publish Date - 2023-09-08T08:48:24+05:30 IST
కంచన్ బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్కు వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించారు.
హైదరాబాద్ : కంచన్ బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్కు వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించారు. అయితే నిన్న ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. నేటి తెల్లవారుజామున రవీందర్ తుదిశ్వాస విడిచారు. పోలీసులు డీఆర్డీవో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే డీఆర్డీవో వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. మరోవైపు డీఆర్డీవో అపోలో వద్ద హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు.
తనకు రావాల్సిన జీతం కోసం కార్యాలయం వద్దకు వెళ్లగా, అక్కడ ఉన్న ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు, మరో ఇద్దరు తనను అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని రవీందర్ తన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం. దీంతో ఆ అవమానాన్ని భరించలేక హెడ్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఒంటికి హోంగార్డ్ రవీందర్ నిప్పు అంటిచుకున్నారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత పరిస్థితి విషమించడంతో ఉస్మానియా నుంచి కంచన్ బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. తనకు జరిగిన అన్యాయం ఇతర హోంగార్డులకు జరగకుండా చూడాలని వేడుకున్నట్లు తెలిసింది. ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య, పిల్లలు మనీశ్ (16), కౌశిక్ (13) ఉన్నారు. రవీందర్ పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.