Trs Delhi Liquor Case: ‘గులాబీ’లో గుబులు!

ABN , First Publish Date - 2023-03-08T01:56:31+05:30 IST

ఢిల్లీ లిక్కర్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్త, ‘సౌత్‌ గ్రూప్‌’ సభ్యుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేయడం ‘గులాబీ దళం’లో గుబులు రేపుతోంది.

Trs Delhi Liquor Case: ‘గులాబీ’లో గుబులు!

ఢిల్లీ లిక్కర్‌ కేసులో పిళ్లై అరెస్టుపై చర్చ

కవిత అరెస్టు తప్పదన్న అభిప్రాయాలు

ఎన్నికల ముందు పార్టీకి నష్టమనే భావన

తిహాడ్‌లో సిసోడియా విచారణ

ఎక్సైజ్‌ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు,

ఫోన్లు మార్చడంపై ఈడీ ప్రశ్నలు

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్త, ‘సౌత్‌ గ్రూప్‌’ సభ్యుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేయడం ‘గులాబీ దళం’లో గుబులు రేపుతోంది. సీఎం కేసీఆర్‌ కుమార్తె, అధికార బీఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవితకూ ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆమెను కూడా అరెస్టు చేస్తారా? ఒకవేళ అదే జరిగితే పార్టీకి నష్టం జరుగుతుందా? రానున్న ఎన్నికల ముందు ఈ అరెస్టు ప్రభావం పార్టీపై ఎలా ఉంటుంది? ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి? అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. వాస్తవానికి కవితను అరెస్టు చేస్తారన్న వార్తలు ఇప్పటికే గుప్పుమంటున్నాయి. ఈడీ దృష్టి పెట్టిందంటే.. అన్ని సాక్ష్యాలనూ పక్కాగా సేకరించి, అరెస్టుల పర్వానికి దిగుతుందన్న అభిప్రాయాలున్నాయి. సౌత్‌ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవతోపాటు గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌, బుచ్చిబాబు ఉన్నారు.

కవితకు లబ్ధి చేకూర్చడానికి అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని ఈడీ తన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌’లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద అరుణ్‌ పిళ్లైను అరెస్టు చేసింది. నగర శివార్లలోని వట్టినాగులపల్లిలో రూ.2.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసింది. ఇలా పిళ్లై చుట్టూ కేసు బిగుసుకుంటుండడంతో.. అదే సౌత్‌ గ్రూప్‌లో ఉన్న కవితను కూడా అరెస్టు చేయవచ్చనే చర్చ మంగళవారం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పటికే రామచంద్ర పిళ్లై ఈడీకి చాలా సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. దీంతో కవిత అరెస్టు తప్పదంటూ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

బీఆర్‌ఎ్‌సకు ఇదే పెద్ద షాక్‌..

నిజానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎ్‌సకు అరెస్టు వంటి పెద్ద పెద్ద షాక్‌లు తగిలిన సందర్భాలు లేవు. పార్టీ ముఖ్యనేతలు ఎప్పుడూ అరెస్టు కాలేదు. ప్రధానంగా అవినీతి సంబంధిత కేసులు బీఆర్‌ఎ్‌సను చుట్టుముట్టలేదు. గతంలో సీఎం కేసీఆర్‌ చుట్టూ సహారా కేసు బిగుసుకున్నా.. అది పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కూతురు చుట్టూ ఢిల్లీ లిక్కర్‌ కేసు బిగుసుకుంటుండడంతో పార్టీలో చర్చనీయాశమైంది. పైగా.. ఇది మనీ లాండరింగ్‌ యాక్ట్‌ పరిధిలోకి వెళ్లడంతో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఈడీ పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తుందని, బెయిల్‌ కూడా లభించని రీతిలో ఆధారాలను రుజువు చేస్తుందని అంటున్నారు. ఇది సీఎం కేసీఆర్‌ను, పార్టీలోని ఇతర నేతలను ఆందోళనకు గురి చేస్తోంది.

కవితను అరెస్టు చేయకుండా కేంద్రంలోని బీజేపీని కొంత భయపెట్టాలని బీఆర్‌ఎస్‌ పెద్దలు రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ వంటి వేట కుక్కలను వదులుతోందని మంత్రి కేటీఆర్‌ బహిరంగంగానే ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఒక అడుగు ముందుకు వేసి.. ప్రధాని మోదీపై లేఖాస్త్రం సంధించారు. బెంగా ల్‌, పంజాబ్‌, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, భగవత్‌సింగ్‌ మాన్‌, కేజ్రీవాల్‌ సహా మొత్తం తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలను కలుపుకొని ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాల నేతలపైకి ఉసిగొల్పుతున్నారని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విరుచుకుపడ్డారు. ఈ లేఖ రాయడానికి కేసీఆరే చొరవ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. కేంద్రం కొంత వెనక్కి తగ్గి, కవిత విషయంలో ఈడీని నియంత్రిస్తుందన్న ఆలోచనతోనే ఇలాంటి లేఖను ప్రయోగించారని చెప్పుకొంటున్నారు.

మోదీని కలిసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం!

గతంలోనూ కేసీఆర్‌.. ప్రధాని మోదీని కలిసే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. గత అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలకు కేసీఆర్‌ హాజరై అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు తన వెంట కూతురు కవితను కూడా తీసుకెళ్లారు. వారం రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు. బీఆర్‌ఎస్‌ విస్తరణలో భాగంగా విపక్ష నేతలను కలవడానికే ఢిల్లీలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వెలువడినా.. ప్రధానిని కలవడానికే అక్కడ ఉన్నారని బీజేపీ వర్గాలు అప్పట్లోనే బయటపెట్టాయి. ఒకవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. తన కూతురుతో సహా కలిసి, ఢిల్లీ లిక్కర్‌ కేసు నుంచి ఆమెను రక్షించుకోవాలని అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, బీజేపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను దూరం పెట్టిన ట్లు రాష్ట్రంలోని ఆ పార్టీ వర్గాలు అప్పట్లో వెల్లడించా యి. అవినీతి నేతలను ప్రధాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరంటూ కుండబద్దలు కొట్టాయి. ప్రధానిని కలిసే అవకాశం లభించకపోవడంతో కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశారు. ఇప్పుడు కేసు మరిం త జటిలమవుతుండడంతో బీఆర్‌ఎ్‌సలో ఆందోళన నెలకొంది. కేసు నుంచి ఎలా బయట పడాలన్నదానిపై కేసీఆర్‌, కవిత, పార్టీకి న్యాయ సలహాలు ఇచ్చే బోయినపల్లి వినోద్‌కుమార్‌ తదితరులు చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు జరుపుతున్నారు. రామచంద్ర పిళ్లై అరెస్టు నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ఆరా తీసినట్లు తెలిసింది.

అరెస్టుతో ప్రభావం పడుతుందా?

ఒకవేళ కవితను అరెస్టు చేస్తే.. దాని ప్రభావం బీఆర్‌ఎ్‌సపై ఉంటుందా అన్న కోణంలోనూ పార్టీ అగ్రనేతల్లో చర్చ జరుగుతోంది. అసలే ఇది ఎన్నికల సంవత్సరం. ఇలాంటి సందర్భంలో అరెస్టు జరిగితే పార్టీకి కొంత నష్టమేనన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, తెలంగాణలో కుటుంబ పాల న సాగుతోందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరద పారిందని, ధరణి పోర్టల్‌ అవినీతి అడ్డా అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత అవినీతి కేసులో అరెస్టయితే.. ప్రతిపక్షాలకు మరింత అవకాశమిచ్చినట్లవుతందని ‘గులాబీ బాస్‌’తోపాటు పార్టీలోని నిర్ణయాత్మక స్థానంలో ఉన్న నేతలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-08T01:56:31+05:30 IST