TPCC Chief: రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని సీబీఐ, ఈడీ..

ABN , First Publish Date - 2023-03-28T14:09:59+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ, ఈడీ అపాయింట్‌మెంట్ల కోసం టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

TPCC Chief: రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని సీబీఐ, ఈడీ..

న్యూఢిల్లీ: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) కి సంబంధించి సీబీఐ (CBI), ఈడీ (ED) అపాయింట్‌మెంట్ల కోసం టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ రెండు సంస్థల నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్‌ లభించలేదు. దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నాప్రత్నం లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని.. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌ (Minister KTR)కు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. గత రెండు మూడు రోజులుగా సీబీఐ, ఈడి అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ రెండు సంస్థల డైరెక్టర్లు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఒక ఎంపీగా తాను అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని తెలిపారు. హవాలాతో పాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయన్నారు. సిట్ అధికారి అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదని... తద్వారా ముఖ్యమైన వ్యక్తులను కాపాడేందుకు సిట్ అధికారి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందే అని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని.. ఇందులో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కేటీఆర్ తత్తర, తొందరపాటు చూస్తే జనానికి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. లీకేజ్‌కి పాల్పడిన వ్యక్తుల మధ్య గొడవతో ఇది బయటపడిందని చెప్పారు. రాష్ట్రంలో సంచలన ఘటనలు జరిగినప్పుడు, అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడినప్పుడు, పక్కదారి పట్టించడం కోసం మాత్రమే సిట్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, అమ్మకం కుంభకోణంలో కూడా అలాగే చేశారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రికి సంబంధం ఏంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని... టీఎస్‌పీఎస్సీలో చైర్మన్ సహా అర్హత లేని ఏడుగురి నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారని వ్యాఖ్యానించారు. కావలసిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి పరీక్షలు రాయించారన్నారు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడ్డ తర్వాత ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అంటూ కేటీఆర్ చెప్పారని... అప్పటికి నిందితులను కస్టడీలోకి కూడా తీసుకోలేదు. విచారణ జరగలేదన్నారు. విచారణ జరగకముందే కేటీఆర్‌కు ఈ విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు.

కేటీఆర్ పీఏ తిరుపతి, రాజశేఖర్ రెడ్డి పక్క పక్క మండలాలకు చెందినవారన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా రాజశేఖర్ రెడ్డిని చేర్చుకోవడంలో తిరుపతి పాత్ర ఉందని అన్నారు. ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ బయటికి వచ్చి, తన పీఏ మీద ఆరోపణలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారన్నారు. సిట్ పూర్తి కాకముందే, కోర్టుకు నివేదికలు అందించకముందే కేటీఆర్‌కు సమాచారం ఎలా వస్తుందని నిలదీశారు. కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి ప్రశ్నించాలని తాను సిట్ అధికారిని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కేటీఆర్‌కు నోటీసు ఇవ్వడం మాని, తనకు నోటీస్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ జరుగుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ పీఏ తిరుపతి ఒక పావు మాత్రమే అని అన్నారు. ఇందులో కేటీఆర్ పాత్ర పూర్తిగా ఉందని తాను పునరుద్ఘాటిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌‌కు సంబంధించి ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో సిట్ ముందు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-28T14:09:59+05:30 IST