Raja Singh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదు

ABN , First Publish Date - 2023-03-30T15:25:29+05:30 IST

విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1(ఏ) కింద ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Raja Singh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదు
Raja Singh

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)పై ముంబై (Mumbai) లో కేసు నమోదైంది. 2023, జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1(ఏ) కింద ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు. ఓ కేసులో బెయిల్ ఇచ్చే క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు షరతు విధించిందని ఆ నోటీసులో గుర్తుచేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. ముంబైలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మంగళ్‌హట్ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై రాజాసింగ్ స్పందిస్తూ ధర్మం కోసం అవసరమైతే జైలుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పీడీయాక్ట్‌పై జైల్లో ఉన్న రాజాసింగ్‌కు 2022, నవంబర్ 9న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్‌లో హైదరాబాద్ శిల్పారామంలో కమెడియన్ మునావర్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం నేతలు ఆరోపించారు. పలు ముస్లిం సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించారు. రాజాసింగ్‌పై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పీడీయాక్ట్‌ను నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ కేసులో గతేడాది నవంబర్ 9న హైకోర్టు బెయిల్ ఇచ్చింది.

Updated Date - 2023-03-30T15:35:08+05:30 IST