TS News: గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2023-06-05T15:40:27+05:30 IST

గ్రూప్ 1 పరీక్షల (Group 1 exams) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్‌సిగ్నలిచ్చింది. గ్రూప్ 1 పేపర్ రద్దు చేయాలన్న పిటిషన్లలను న్యాయస్థానం కొట్టివేసింది.

TS News: గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షల (Group 1 exams) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్‌సిగ్నలిచ్చింది. గ్రూప్ 1 పేపర్ రద్దు చేయాలన్న పిటిషన్లలను న్యాయస్థానం కొట్టివేసింది. పేపర్ లీక్‌కు కారణమైన సిబ్బందితోనే మళ్లీ గ్రూప్-1 నిర్వహిస్తున్నారని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. 24 గంటల్లోనే 1.60 లక్షల మంది అభ్యర్థులు.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కోర్టు దృష్టికి తెచ్చింది. గ్రూప్ 1 రాసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కోర్టు తీర్పుతో తెలంగాణలో ఈనెల 11న యథావిధిగా గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1తోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా 19 విభాగాల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గతేడాది అక్టోబరు 16న 1019 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. సుమారు 2.86 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,050 మందిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేశారు. జూన్‌లో మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, ఇంతలోనే పేపర్‌ లీకేజీ వ్యవహారం బహిర్గతం కావడం, ప్రిలిమినరీ పరీక్షను అధికారులు రద్దు చేశారు.

Updated Date - 2023-06-05T15:40:27+05:30 IST