Share News

Vijayashanti : తల్లి తెలంగాణ నుంచి ఇప్పటి వరకూ విజయశాంతి ఎన్ని మార్పులో..!!

ABN , First Publish Date - 2023-11-18T17:50:17+05:30 IST

అప్పుడెప్పుడో టాలీవుడ్‌లో ఓ సాంగ్ బాగా పాపులర్ అయింది. ‘‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా?’’ అనే పాట విన్నారు కదా?. అచ్చం అలాగే ఉంది తెలంగాణ రాజకీయాల పరిస్థితి.

Vijayashanti : తల్లి తెలంగాణ నుంచి ఇప్పటి వరకూ విజయశాంతి ఎన్ని మార్పులో..!!

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే సామెత లోకంలో చాలా కాలంగా ఉంది. ప్రధానంగా ఈ సామెత అవకాశవాద రాజకీయాలనుద్దేశించి ఉపయోగిస్తుంటారు. కొంత మంది బట్టలు మార్చుకున్నంత ఈజీగా కండువాలు మార్చేస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో జరుగుతోంది ఇదే.!

అప్పుడెప్పుడో టాలీవుడ్‌లో ఓ సాంగ్ బాగా పాపులర్ అయింది. ‘‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా?’’ అనే పాట విన్నారు కదా?. అచ్చం అలాగే ఉంది తెలంగాణ రాజకీయాల పరిస్థితి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. మంచినీళ్లు తాగినంత సులువుగా క్షణాల్లో పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. సీటు దొరక్క కొందురు.. అసంతృప్తితో మరికొందరు పార్టీలు మారిపోతున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‌లో కనిపిస్తున్న సీన్లు ఇవే.

తాజాగా.. లేటుగా.. లేటెస్ట్‌గా విజయశాంతి కూడా కండువా మార్చేశారు. విచిత్రమేంటంటే నామినేషన్లు అయిపోయాక పార్టీ మారిపోయారు. ఇతర పార్టీల నుంచి పిలుపు రాలేదో.. లేదంటే సీటు హామీ రాలేదో తెలియదు గానీ లేటుగానైనా మళ్లీ హస్తం గూటికే చేరారు. ఒకటా రెండా ఇప్పటి వరకూ ఐదుసార్లు పార్టీ మారారు రాములమ్మ.

బీజేపీతో మొదలైన రాములమ్మ ప్రస్థానం.. అటు తర్వాత ‘తల్లి తెలంగాణ’ పార్టీ స్థాపించి బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. అనంతరం ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి మెదక్ ఎంపీగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత చెయ్యి పార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగి బీజేపీలో చేరారు. ఇక్కడ కూడా ఇమడలేకపోయారు. దీంతో బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఐదుసార్లు కండువాలు మార్చిన రాములమ్మ.. మరీ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-18T17:54:40+05:30 IST