Rohit Sharma: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆ రెండు కారణాల వల్లే భారత్ ఓటమి

ABN , First Publish Date - 2023-06-11T19:56:49+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా చేతిలో భారత్ (India) ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ప్రధాన కారణాలను వెల్లడించారు. బౌలింగ్, రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్‌లో రాణించలేదని పేర్కొన్నాడు. 209 పరుగుల తేడాతో టీం ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయి చేజేతులా విజయాన్ని ఆసీస్‌కు అప్పగించింది. దీంతో టీం ఇండియా చేజిక్కించుకోవాల్సి డబ్ల్యూటీసీ ట్రోపీని ఆస్ట్రేలియాకు అందించింది.

Rohit Sharma: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆ రెండు కారణాల వల్లే భారత్ ఓటమి

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా చేతిలో భారత్ (India) ఓడిపోవడానికి రోహిత్ శర్మ రెండు ప్రధాన కారణాలను చెప్పాడు. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అనంతరం తాము బౌలింగ్ తీసుకున్నామని, పరిస్థితిని బట్టి ఆస్ట్రేలియాకు (Australia) బ్యాటింగ్‌ చేసే అవకాశం ఇవ్వడం ప్రభావం చూపిందన్నారు. అయితే తొలి ఇన్నింగ్స్‌ మొదటి సెషన్‌లో బాగానే బౌలింగ్ చేశామని, ఆ తర్వాత బౌలింగ్ తీరు నిరాశపరిచిందని కెప్టెన్ వివరించాడు. అదే అదునుగా ఆసీస్ బ్యాటర్లు ఎక్కువ స్కోర్ చేశారని, హెడ్ - స్టీవెన్ స్మిత్‌ కలిసి బాగా ఆడారని, అది తమను విజయానికి దూరం చేసిందంటూ ఓటమిపై రోహిత్ వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియా 76/3 వద్ద ఉన్నప్పుడు హెడ్, స్మిత్ క్రీజ్‌లోకి వచ్చారని, నాలుగో వికెట్‌కు 285 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది ఆస్ట్రేలియాను 469 పరుగుల భారీ స్కోరుకు తీసుకువెళ్లిందన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే - శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ ప్రయత్నాలపై ప్రశంసలు కురిపించిన శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్‌లో రాణించలేదని పేర్కొన్నాడు.

తాము 150 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత రహానే- శార్దూల్ నుంచి బాగా ఆడారని చెప్పారు. వారు నిలదొక్కుకుని మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని శర్మ అన్నారు. తాము రెండవ ఇన్నింగ్స్‌లో చాలా బాగా బౌలింగ్ చేశామని, మళ్లీ తాము సరిగా బ్యాటింగ్ చేయకపోవడమే ఓటమి కారణమని చెప్పుకొచ్చారు. బ్యాటింగ్ చేయడానికి ఐదు రోజులూ పిచ్ అనుకూలంగా ఉన్నప్పటికీ తాము విజయం సాధించలేకపోయామని శర్మ పేర్కొన్నాడు.

టీం ఇండియా వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుకోవడం గొప్ప ప్రయత్నమని శర్మ చెప్పారు. అయినప్పటికీ ఓటమి నిరాశపర్చిందన్నారు. ఈ సిరీస్‌లో చాలా మంది ఆటగాళ్లు పాల్గొన్నారని, ఇది గొప్ప ప్రయత్నమని, తదుపరి ఛాంపియన్‌షిప్ కోసం కూడా పోరాడాలని శర్మ అన్నారు.

Updated Date - 2023-06-11T21:01:09+05:30 IST