India vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలకు తొలి ఓటమి

ABN , First Publish Date - 2023-07-16T19:18:16+05:30 IST

బంగ్లాదేశ్ పర్యటనటో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మహిళల క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే మొదటి విజయం.

India vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలకు తొలి ఓటమి

ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనటో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మహిళల క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే మొదటి విజయం. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత అమ్మాయిలు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయారు. బ్యాటర్ల ఘోర వైఫల్యం టీమిండియా కొంపముంచింది. స్వల్ప లక్ష్యాన్ని సైతం చేధించలేక మన అమ్మాయిలు చేతులెత్తేశారు. 44 ఓవర్లలో 153 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయారు. అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటి 35.5 ఓవర్లలో 113 పరుగులో భారత మహిళల జట్టు కుప్పకూలింది. దీంతో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. 20 పరుగులు చేసిన దీప్తి శర్మనే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. అమన్‌జోత్ కౌర్ 15, యస్తికా భాటియా 15, స్మృతి మంధాన 11, ప్రియా పునియా 10, జెమిమా రోడ్రిగ్స్ 10, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 5 పరుగులు మాత్రమే చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో పేసర్ మరుఫా అక్టర్ 4, స్పిన్నర్ రబేయా ఖాన్ 3 వికెట్లతో చెలరేగారు.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వర్షం రావడంతో టాస్ వేయడానికి ఆలస్యమైంది. వర్షం ఆగాక డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం అంపైర్లు మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు 43 ఓవర్లు ఆడి 152 పరుగులకు ఆలౌటయ్యారు. 39 పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా టాప్ స్కోరర్‌గా నిలిచింది. 27 పరుగులు చేసిన ఫర్గానా హోక్ పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అమంజోత్ కౌర్ 4 వికెట్లతో చెలరేగింది. దేవికా వైద్య 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. బంగ్లాదేశ్ ప్లేయర్ మరుఫా అక్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టు 1-0తో అధిక్యంలోకి వెళ్లింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఓడిపోయింది.

Updated Date - 2023-07-16T19:18:16+05:30 IST