Korea Open 2023: కొరియా ఓపెన్ విజేత భారత్.. సాత్విక్-చిరాగ్‌కు అందిన ప్రైజ్‌‌మనీ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-07-23T15:27:33+05:30 IST

బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో భారత్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిల(Satwiksairaj Rankireddy and Chirag Shetty) జోరు కొనసాగుతుంది. వరుసగా రెండు నెలల్లో రెండు బీడబ్య్లూఎఫ్ సూపర్ 500 (BWF Super 500) టైటిళ్లను గెలుచుకున్నారు. తాజాగా ఈ జంట కొరియా ఓపెన్ టైటిల‌్‌ను(Korea Open 2023) తమ ఖాతాలో వేసుకుంది.

Korea Open 2023: కొరియా ఓపెన్ విజేత భారత్.. సాత్విక్-చిరాగ్‌కు అందిన ప్రైజ్‌‌మనీ ఎంతంటే..?

యోసు(కొరియా): బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో భారత్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిల(Satwiksairaj Rankireddy and Chirag Shetty) జోరు కొనసాగుతుంది. వరుసగా రెండు నెలల్లో రెండు బీడబ్య్లూఎఫ్ సూపర్ 500 (BWF Super 500) టైటిళ్లను గెలుచుకున్నారు. తాజాగా ఈ జంట కొరియా ఓపెన్ టైటిల‌్‌ను(Korea Open 2023) తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సాత్విక్-చిరాగ్ శెట్టి జంట ఫైనల్‌ పోరులో ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడి అర్ఫియాన్-అర్డినాంటోను మట్టి కరిపించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. దక్షిణ కొరియాలోని యోసులో గల జిన్నామ్ స్టేడియంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్ఫియాన్-అర్డినాంటోపై సాత్విక్-చిరాగ్ జంట 17-21, 21-13, 21-14తో గెలిచింది.


40 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత సాత్విక్-చిరాగ్ అద్భుతంగా పుంజుకున్నారు. ప్రత్యర్థి సర్వీస్‌ను పదేపదే బ్రేక్ చేస్తూ బలమైన స్మాష్‌లతో విరుచుకుపడ్డారు. రెండు జంటలు హోరాహోరీగా పోరాడడంతో రెండో సెట్‌ ఆరంభంలో 9-8తో స్కోర్‌లో స్వల్ప తేడానే కనిపించింది. కానీ ఈ సమయంలో భారత్ ద్వయం సాత్విక్-చిరాగ్ వరుసగా 5 పాయింట్లు సాధించి అధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించి 21-13తో సెట్‌ను కైవసం చేసుకున్నారు. మ్యాచ్ ఫలితం కోసం నిర్ణయించిన మూడో సెట్‌లోనూ తమ జోరును కొనసాగించిన భారత్ జోడి 21-14తో సెట్‌తోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా గత నెలలోనే సాత్విక్-చిరాగ్ జంట ఇండోనేషియా ఓపెన్‌ను గెలుచుకుంది. అంతకుముందే స్విస్ ఓపెన్‌ను కూడా గెలుచుకుంది. మొత్తంగా 2023 వరల్డ్ బ్యాడ్మింటన్‌ సూపర్ 500లో సాత్విక్-చిరాగ్‌కు ఇది మూడో టైటిల్. ఇక కొరియా ఓపెన్ మొత్తం ప్రైజ్‌మనీ 420,000 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.3,44,35,800 కోట్లు. ఇందులో మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన భారత జోడి సాత్విక్-చిరాగ్‌కు 33,180 డాలర్లు ప్రైజ్‌మనీగా అందనుంది. అంటే మన కరెన్సీలో రూ.27,20,428 లక్షలు.

Updated Date - 2023-07-23T15:48:24+05:30 IST