Umesh Yadav: టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట విషాదం

ABN , First Publish Date - 2023-02-23T16:16:31+05:30 IST

టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav) ఇంట విషాదం చోటుచేసుకుంది

Umesh Yadav: టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట విషాదం

నాగ్‌పూర్: టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav) ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి తిలక్ యాదవ్(Tilak Yadav) కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ప్రొఫెషనల్ రెజ్లర్(Wrestler) అయిన తిలక్ యాదవ్.. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌(Western Coalfields)లోనూ పనిచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ఉమేశ్ యాదవ్ ఎంపికైనప్పటికీ తొలి రెండు టెస్టుల్లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తిలక్ యాదవ్ మృతితో ఉమేశ్ యాదవ్ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. విషయం తెలిసిన టీమిండియా(Team India) క్రికెటర్లు, అభిమానులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రెండో టెస్టు ముగిసిన వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ఆసీస్‌తో మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంతో సెలక్షన్‌కు ఉమేశ్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉమేశ్ యాదవ్‌తో పోలిస్తే మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలకే ఎక్కువ చాన్స్ ఉంది. మూడో టెస్టులో కనుక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటే అప్పుడు భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. అదే జరిగితే మూడో టెస్టులోనే ఉమేశ్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు.

2011లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్(Umesh Yadav) ఇప్పటి వరకు 54 టెస్టులు ఆడాడు. అయితే, తరచూ జట్టులోకి వచ్చి పోతున్నాడు. చివరిసారి గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌లో జరిగిన టెస్టులో ఆడాడు. అలాగే, 75 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. వన్డేల్లో 79 వికెట్లు తీసుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. అయితే, 2018 తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. 2022 టీ20 ప్రపంచకప్‌కు ముందు టీ20ల్లోకి తిరిగి వచ్చాడు.

Updated Date - 2023-02-23T16:16:34+05:30 IST