Team india: ఫిట్‌నెస్‌లో సన్‌రైజర్స్ ఆటగాడే టాప్.. కోహ్లీ, గిల్‌ను మించిపోయాడుగా..!!

ABN , First Publish Date - 2023-09-15T14:41:39+05:30 IST

టీమిండియాకు సంబంధించి శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీల కంటే మరో ఆటగాడికి అత్యధిక యోయో స్కోర్ వచ్చినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు 21.1 పాయింట్ల స్కోరు వచ్చింది.

Team india: ఫిట్‌నెస్‌లో సన్‌రైజర్స్ ఆటగాడే టాప్.. కోహ్లీ, గిల్‌ను మించిపోయాడుగా..!!

శ్రీలంకలోని ఆసియా కప్‌లో పాల్గొనేందుకు వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లకు బెంగళూరులోని ఎన్‌సీఏలో బీసీసీఐ అధికారులు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు 17.2 పాయింట్ల స్కోరు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. అయితే ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించిన యోయో టెస్టులో కోహ్లీ కంటే శుభ్‌మన్ గిల్‌కు 18.7 పాయింట్ల స్కోరు వచ్చిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో టీమిండియా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే కోహ్లీ, గిల్ మధ్య వయసు వ్యత్యాసం పదేళ్లకు పైగా ఉంటుందని.. 30 ప్లస్ వయసులో కూడా కోహ్లీ 17.2 పాయింట్ల స్కోరు సాధించడం గొప్ప విషయం అని పలువురు అభిప్రాయపడ్డారు.

కట్ చేస్తే ఇప్పుడు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీల కంటే మరో ఆటగాడికి అత్యధిక యోయో స్కోర్ వచ్చినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు 21.1 పాయింట్ల స్కోరు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు. దీంతో క్రికెట్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. అతడు మనిషేనా లేదా మిషనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియాలో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల కంటే మయాంక్ ఎక్కువ స్కోరు సాధించడంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి జట్టులో స్థానం సంపాదించకపోయినా ఫిట్‌నెస్ విషయంలో మయాంక్ గొప్ప సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Ben Stokes: ఇంత ఫైర్ ఉన్నోడివి.. ఎందుకు రిటైర్ అయ్యావు?

కాగా మయాంక్ అగర్వాల్ టీమిండియా తరఫున ఎక్కువగా టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2022లో శ్రీలంకలో స్వదేశంలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో మయాంక్ సరైన ప్రదర్శన చేయలేదు. అదే ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో రోహిత్ స్థానంలో మయాంక్ ఎంపికైనా తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. అనంతరం మళ్లీ అతడు జట్టులోకి రాలేకపోయాడు. మయాంక్ మళ్లీ జట్టులోకి రావాలంటే ఓపెనింగ్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే రోహిత్, గిల్, ఇషాన్ కిషన్, యషస్వీ జైశ్వాల్ మధ్య పోటీ ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్యాకప్ ఓపెనర్‌గా స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తే తప్ప మయాంక్‌ను మళ్లీ జాతీయ జట్టులో చూసే అవకాశం ఉండదనే చెప్పాలి.

Updated Date - 2023-09-15T14:41:39+05:30 IST