Share News

Shai Hope: ధోనీపై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

ABN , First Publish Date - 2023-12-04T21:18:36+05:30 IST

Shai Hope: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి దాదాపు నాలుగేళ్లు దాటుతున్నా అతడి క్రేజ్ తగ్గలేదు. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ చెప్పిన సలహా వల్లే తాము ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో గెలిచామని చెప్పాడు.

Shai Hope: ధోనీపై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి దాదాపు నాలుగేళ్లు దాటుతున్నా అతడి క్రేజ్ తగ్గలేదు. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ చెప్పిన సలహా వల్లే తాము ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో గెలిచామని చెప్పాడు. వెస్టిండీస్ క్రికెట్ ప్రస్తుతం దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. కానీ తమ సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2019 వన్డే ఛాంపియన్ ఇంగ్లండ్‌ను వెస్టిండీస్ ఓడించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (71), క్రాలే (48), సాల్ట్‌ (45) రాణించారు. విండీస్‌ బౌలర్లలో షెఫర్డ్‌, మొటెయ్‌, ఒషానె థామస్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 326 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 48.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ హోప్‌ అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 83 బంతుల్లోనే 109 పరుగులు చేసిన అతడికి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... తన సూపర్ ఇన్నింగ్స్‌కు పరోక్షంగా ధోనీ కారణమని వెల్లడించాడు. గతంలో ధోనీతో ఒకసారి మాట్లాడానని.. క్రీజులో ఎంతసేపు ఉండాలని భావిస్తావో దానికంటే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చాడని.. దాంతో ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఆఖరి వరకు నిలిచి విజయం సాధించినట్లు హోప్ వివరించాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T21:18:37+05:30 IST