Rohit Sharma: ఆ పాఠాలను ఎవరి దగ్గర నేర్చుకున్నాడో బయటపెట్టేసిన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2023-02-12T16:54:23+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ(Rohith Sharma) సేన

 Rohit Sharma: ఆ పాఠాలను ఎవరి దగ్గర నేర్చుకున్నాడో బయటపెట్టేసిన రోహిత్ శర్మ

నాగ్‌పూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ(Rohith Sharma) సేన ఘన విజయం సాధించింది. ముచ్చటగా మూడో రోజే ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో విజయ ఢంకా మోగించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగుల చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ఓ కీలక విషయాన్ని బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ()Virat Kohli) టెస్టు కెప్టెన్సీని చూసి తాను పాఠాలు నేర్చుకున్నాన్నట్టు చెప్పాడు. టెస్టుల్లో బౌలర్లను కోహ్లీ అద్భుతంగా వినియోగించుకునే వాడని కొనియాడాడు. అది చూసి తాను చాలా నేర్చుకున్నానని పేర్కొన్నాడు. పిచ్ అనుకూలంగా ఉన్నా సరే కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితాలు రావన్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచి అది కొనసాగించుకుంటూ పోతేనే విజయాలు సొంతమవుతాయన్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లీ అదే పనిచేసేవాడని, అతడి నుంచి ఆ విషయం గ్రహించిన తాను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నట్టు చెప్పాడు.

పరిస్థితులు ఎప్పుడూ రెండు జట్లకు ఒకేలా ఉంటాయన్న రోహిత్.. పిచ్‌ నుంచి అనుకూలమైన ఫలితాలను రాబట్టుకుంటేనే బౌలర్లు ప్రత్యేకంగా నిలుస్తారన్నాడు. ఇలాంటి పిచ్‌లపై ఎక్కడ బంతులు విసిరితే ఫలితం ఉంటుందో వారికి బాగా తెలుసని, అదే చేస్తూ వారు బ్యాటర్లపై ఒత్తిడి పెంచి వారి పనిపడుతుంటారని రోహిత్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను ఆటగాడిగా ఉన్నానని, అప్పుడే కోహ్లీ నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నట్టు రోహిత్ వివరించాడు. చక్కని ఫీల్డింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుందని, అప్పుడే వారు పొరపాట్లు చేసి వికెట్లు సమర్పించుకుంటారని అన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బౌలింగును దగ్గరుండి గమనించానన్నాడు. అప్పుడు నేర్చుకున్న దానిని ఇప్పుడు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. ప్రతి బంతికి వికెట్లు రావన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని, కష్టపడడం మానకూడదని పేర్కొన్నాడు. కాగా, ఈ నెల 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం అవుతుంది.

Updated Date - 2023-02-12T16:54:25+05:30 IST