YSRCP: పాలకొల్లు అసెంబ్లీ సీటు.. వైసీపీలో హీటు.. అసలు సిసలైన గెలుపు గుర్రం ఇదిగో అంటూ..

ABN , First Publish Date - 2023-08-12T11:33:10+05:30 IST

బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఒకప్పుడు అన్వేషణ సాగించే వారు. ఇప్పుడు దానికి భిన్నంగా వైసీపీ బీసీల వేటకు దిగింది. పనిలో పనిగా ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో తెలుసుకునే ఆ దిశగా ఆరా తీస్తోంది. దీనిలో భాగంగా పార్టీలో చాన్నాళ్లుగా నానుతున్న పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొత్త ముఖాన్ని రంగంలోకి దింపారు.

YSRCP: పాలకొల్లు అసెంబ్లీ సీటు.. వైసీపీలో హీటు.. అసలు సిసలైన గెలుపు గుర్రం ఇదిగో అంటూ..

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన వైసీపీ, వచ్చే ఎన్నికల్లో నిలదొక్కుకోవడానికి ఇప్పుడు ఆపసోపాలు పడే పరిస్థితికి వచ్చింది. పైపైకి ఐ ప్యాక్‌ నివేదికలు, నిఘా బృందాలు, ఇతర పార్టీ వర్గాల నుంచి అందుతున్న అనుకూల నివేదికలతో సరిపెట్టకుండా మరింత జాగ్రత్త పడబోతున్నారా? అనే ప్రశ్నలే ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఒకప్పుడు అన్వేషణ సాగించే వారు. ఇప్పుడు దానికి భిన్నంగా వైసీపీ బీసీల వేటకు దిగింది. పనిలో పనిగా ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో తెలుసుకునే ఆ దిశగా ఆరా తీస్తోంది. దీనిలో భాగంగా పార్టీలో చాన్నాళ్లుగా నానుతున్న పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొత్త ముఖాన్ని రంగంలోకి దింపారు. అది కూడా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఢీకొనేందుకు ఆర్థిక సత్తాతో పాటు బీసీ కార్డును ఎంచుకున్నారు. ఆది నుంచి ఇలాంటి ప్రయత్నాలే పాలకొల్లుపై గురిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంతకు మునుపు వైసీపీలో నేతలంతా పోటీ పడేవారు. ఒక్క పాలకొల్లులోనే మేమంటే మేమన్నట్టు పార్టీ అధిష్ఠానం ప్రాపకం సంపాదించేందుకు తిప్పలు పడుతూ వచ్చారు.

సీనియర్‌ నేతలు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ వంటి వారెంతో ఉత్సాహపడ్డారు. ఈ తరుణంలో వీరందరికీ భిన్నంగా ఒకప్పటి జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ను రంగంలోకి దింపి పార్టీ జెండా ఎగరేయించేందుకు ప్రయత్నించారు. అదికూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌ అయితేనే అద్భుతంగా ఉంటుందంటూ అప్పట్లో వైసీపీ గొప్పలకుపోయింది. గడిచిన ఆరు నెలలుగా ఐప్యాక్‌ నివేదికలతో ఒక్కసారిగా మనస్సు మార్చుకుంది. పోటీ పడాలని తపిస్తున్న మేకా శేషుబాబుకు ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించాలని, యడ్ల తాతాజీ సతీమణికి పాలకొల్లు చైర్‌పర్సన్‌ పదవి అప్పగించాలనే ప్రయత్నాలు చురుగ్గా సాగాయంటూ పార్టీలో ప్రచారం సాగింది. అయితే ఒక్కసారిగా వ్యూహం మార్చేశారు. జడ్పీ చైర్మన్‌గా ఉన్న కవురు శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీగా బీసీ కోటాలో ఎంపిక చేశారు. ఆయన స్థానంలో మరెవరిని ఇన్‌చార్జిగా నియమించబోతున్నారో వైసీపీ అంత గుట్టుగా ఉంచింది. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్‌ ఇన్‌చార్జి మిథున్‌రెడ్డి రహస్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఆరా తీస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అసలు సిసలైన గెలుపు గుర్రం ఇదిగో అంటూ వీరవాసరం మండలానికి చెందిన గుడాల గోపి అనే నేతను హఠాత్తుగా రంగంలోకి దింపింది. గోపి వెనుక పెద్ద స్థాయిలో ఉన్న ‘ఇసుక’ నేతలు గట్టిగా వత్తాసు పలికారు. బహుళ వ్యాపారవేత్త శేఖర్‌రెడ్డి ఆశీస్సులు గోపికి ఉన్నాయంటారు.

ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో ఏదొక నియోజకవర్గం నుంచి గోపిని రంగంలోకి దింపితే ఆయన గెలుపు బాధ్యతంతా తామే మోస్తామంటూ ‘ఇసుక’ బృందమంతా వైసీపీ అధినాయకత్వానికి భరోసా ఇవ్వడమే కాకుండా మిథున్‌రెడ్డి సాయంతో చక్రం తిప్పింది. అటు బీసీ వర్గానికి చెందిన వారై ఉంటారని, ఇటు ఆర్థికంగా తాము బయట ఉండి చూసుకుంటామని, ఇంకో వైపు ప్రజాదరణ ఉన్న సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలను అలవోకగా ఢీకొని తీరుతామంటూ వీర ప్రతిజ్ఞ చేసినట్టు చెబుతున్నారు. సీఎం జగన్‌కు కావాల్సింది ఇదేనని, ఈ మేరకు జిల్లా పార్టీ నేతలతో చర్చించకుండానే నేరుగా గోపికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ పరిణామాలపై వైసీపీలో ఉన్న మిగతా వారు గుర్రుగానే ఉన్నారు. అయినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా గోపి వైపు అడుగులు వేయడం వైసీపీలోనే కొందరిని విస్మయపరుస్తోంది. ఈ రహస్యం ఎప్పుడో బట్టబయలైనా ఇప్పటి వరకు ఆ ప్రతిపాదన ఫ్యాను కిందకు చేరకపోవచ్చని కొందరు ఊహించారు. కాని అదేదో కలకాదు నిజమే అన్నట్టు ఇన్‌చార్జి పదవికి గోపికీ కట్టబెట్టారు. ఇక పరిణామాలు ఏమవుతాయనేది కొంతకాలం పాటు వేచి చూడాలి. అంతకంటేమించి గోపి బ్యాక్‌ గ్రౌండ్‌పై ఇప్పటికే పార్టీలోనూ, పార్టీ బయట ఆరా తీసే వారి సంఖ్య పెరిగింది. పాలకొల్లు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా చిరంజీవి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.


తెరపైకి సూర్యచంద్రరావు

ఇప్పటికే పోలవరంలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజును మార్చి ఈసారి మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నారంటూ కొన్ని మాసాలుగా పార్టీలో నానుతోంది. బాలరాజు అనుకూల గ్రాఫ్‌ పూర్తిగా పడిపోయిందని, ఈ కారణంగానే ఆయనను మార్చబోతున్నారంటూ కొందరు ప్రచారం చేశారు. అటవీ శాఖలో ఉద్యోగిగా వున్న తెల్లం సూర్యచంద్రరావు పేరును తెర ముందుకు తెచ్చారు. వైసీపీ అభిమానిగా వున్న ఆయన చాలా కాలంగా దీర్ఘకాలిక సెలవు లోనే ఉంటూ పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ నోటా ఈ నోటా ఈ మధ్యన సూర్యచంద్రరావు పేరు మరింతగా విస్తృత ప్రచారం కావడమే కాకుండా బాలరాజును తప్పించడం ఈసారి తప్పేది లేదన్నట్టు కార్యకర్తల్లో వాదోపవాదాలకు దారితీస్తోంది. వాస్తవానికి బాలరాజు గ్రాఫ్‌పై పార్టీ పెద్దలు ఎవరూ ఆయనకు నేరుగా తెలియజేసినా, చేయకపోయినా ఎమ్మెల్యే సైలెంట్‌గా ఉన్నారు. కొద్దిరోజుల కిందట ఆయనకు హార్ట్‌ స్టంట్‌ వేయడంతో కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే ఐ ప్యాక్‌ నివేదికల ప్రకారం పోలవరంలో పార్టీ గ్రాఫ్‌ క్షీణ దశకు వచ్చిందని, దీనిని అధిగమించాలంటే ‘మార్పు’ అనివార్యమంటూ నివేదించినట్టు చెబుతున్నారు.

ఈలోపే బుట్టాయిగూడెంకు చెందిన తెల్లం సూర్యచంద్రరావు పేరు ప్రముఖంగా ప్రస్తావనలో ఉండడం, ఆయన పార్టీ కేడర్‌లోనూ, ఇతర వర్గాల్లోనూ ప్రాచుర్యం పొందడంతో ఈ మధ్యన పోలవరంలో ఫ్యాను గాలి కాస్తా వేడెక్కింది. ఇప్పటికే పాలకొల్లులో తీసుకున్నట్టుగా నిర్ణయాలు ఏమైనా పోలవరంలోనూ ఉంటాయా, లేదా అనేది చూడాలి. సూర్యచంద్రరావు వ్యక్తిగత వ్యవహారాలు, ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి, విధుల్లో ఉన్నప్పుడు ఉన్న గ్రాఫ్‌, ఇతరత్ర అంశాలను కూడా వైసీపీ ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుందని చెబుతున్నారు. ఇవేవీ ఎక్కడా బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారని, ఒకవేళ బాలరాజుకు టికెట్‌ ఇవ్వకపోయినా అంతకంటే మించి ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదంటూ వైసీపీలో ప్రచారం సాగుతోంది

Updated Date - 2023-08-12T11:33:13+05:30 IST