YCP Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఏమన్నారో తెలిస్తే నోటితో నవ్వరు..!

ABN , First Publish Date - 2023-04-03T14:30:41+05:30 IST

గడపగడపకు ప్రభుత్వం వర్క్‌ షాప్‌లో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తనకు అనుకూలంగా..

YCP Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఏమన్నారో తెలిస్తే నోటితో నవ్వరు..!

అమరావతి: గడపగడపకు ప్రభుత్వం వర్క్‌ షాప్‌లో (Gadapa Gadapaku Prabhutvam) వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి (AP CM Jagan Reddy) పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై (AP MLC Elections Results) తనకు అనుకూలంగా జగన్‌రెడ్డి విశ్లేషణ చేసుకోవడం కొసమెరుపు. లబ్ది చేసిన 80 లక్షల కుటుంబాల్లో కేవలం 2.5 లక్షలు మాత్రమే ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నారని, వాళ్లంతా రకరకాల యూనియన్లకు చెందిన వారని సీఎం జగన్‌ ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పుకొచ్చారు. ఎవరికైతే మంచి చేశామో వారిలో ఎమ్మెల్సీ ఓటర్లలో తక్కువ మంది ఉన్నారని, ఈ ఎన్నికలు ఏ రకంగాను శాంపిల్‌ కాదని జగన్ కొట్టిపారేయడం గమనార్హం.

మనం ఒంటరిగా పోటీ చేశామని, టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేదని ఓటమిని జగన్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన పార్టీలు అన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిశాయని సీఎం జగన్‌ వైసీపీ ఓటమికి బటర్ పూసే ప్రయత్నం చేయడం అక్కడున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను విస్మయానికి గురిచేసింది. ఓటమి ఎదురైతే కారణాలను విశ్లేషించుకునే రాజకీయ నాయకులను చూశాం గానీ ఆ ఓటమిని కూడా స్వీకరించకుండా.. తాము అసలు ఓడిపోలేదన్నట్టుగా మాట్లాడటం జగన్ రెడ్డికే చెల్లిందని గుసగుసలాడుకోవడం సొంత పార్టీ నేతల వంతయింది.

ఏదేమైనా.. వైసీపీ అధినేత జగన్ రెడ్డిలో గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అభద్రతను, అపనమ్మకాన్ని మరింత పెంచాయని ఈ వ్యాఖ్యలతో స్పష్టమైంది. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాలను కైవసం చేసుకుని అధికార వైసీపీకి ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఈ పరిణామంతో మూలిగే నక్కపై తాటి పండు పడినట్టయింది అధికార వైసీపీ పరిస్థితి.

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం, జగన్ వరుస ఢిల్లీ టూర్లు, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే వేటు వేయడం.. ఈ పరిణామాలన్నీ వైసీపీ పనయిపోయిందనే సంకేతాలను ఏపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయని ప్రతిపక్ష టీడీపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ క్రమంలో.. జగన్ రెడ్డి ఎమ్మెల్యేలతో, మంత్రులతో, జిల్లాల ఇంఛార్జ్‌లతో, కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన వర్క్ షాప్ కావడంతో ప్రస్తుతం ఈ అంశం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2023-04-03T14:31:07+05:30 IST