MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!

ABN , First Publish Date - 2023-03-23T21:26:39+05:30 IST

పట్టభద్రుల కోటాలో తగిలిన ఎదురెబ్బ నుంచి కోలుకోక మునుపే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలింది. గెలిచే పరిస్థితులు లేనప్పటికీ..

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!

పట్టభద్రుల కోటాలో తగిలిన ఎదురెబ్బ నుంచి కోలుకోక మునుపే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలింది. గెలిచే పరిస్థితులు లేనప్పటికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) పక్కా వ్యూహంతో పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా బరిలోకి దింపి గెలిపించుకున్నారు. 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ (Panchumarthy Anuradha) విజయకేతనం ఎగరేశారు. అసలు బాబు ఏం ప్లాన్ వేశారో అటు వైసీపీకి.. ఆఖరికి టీడీపీ (Telugudesam) అభ్యర్థికి తెలియట్లేదు. అసలు అనురాధ ఎలా గెలిచారబ్బా..? పార్టీకి ద్రోహం చేసిందెవరు..? వైసీపీని కాదని టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు ఎవరు..? అని వైసీపీ అధిష్టానం (YSRCP High Command) ఆలోచనలో పడింది.

YSR-Congress.jpg

ఇప్పుడిదే చర్చ..!

వాస్తవానికి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముగ్గురు రెబల్స్‌‌గా మారారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం ముగ్గురూ టీడీపీపై అసంతృప్తితో బయటికొచ్చారు. అధికారికంగా ఈ ముగ్గురు వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చి.. సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. అయితే.. ఈ మధ్యనే వైసీపీ రెబల్స్‌గా మారిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) టీడీపీకి ఓట్లేసినప్పటికీ ఇంకా రెండు ఓట్లు కావాల్సి ఉంది. అయితే వైసీపీని కాదని టీడీపీకి ఓట్లేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు..? అనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Undavalli-and-Mekapati.jpg

అనుమానం ఈ ఇద్దరిపైనే..!

టీడీపీ అభ్యర్థి అనురాధకు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ వేశారని అధిష్టానం భావిస్తోందట. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా రోజులు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. శ్రీదేవి తాడికొండ నియోజకవర్గానికి, మేకపాటి ఉదయగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ అసంతృప్తి గళం వినిపించారు. తాడికొండకు ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గానికి ఇంచార్జ్‌ను నియమించింది అధిష్టానం. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు తాడికొండ ఇంచార్జ్ పదవిని జగన్ కట్టబెట్టారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. ఆఖరికి అధికార పార్టీకి వ్యతిరేకంగానే శ్రీదేవి ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం ఇంచార్జ్‌ను అస్సలు మార్చలేదు.

ఇక ఉదయగిరి విషయానికొస్తే..

నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ధనుంజయ్ రెడ్డికి.. ఎమ్మెల్యేకు అస్సలు పడట్లేదు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా పరిశీలకుడు ఎందుకు..? అసలు ఆయనకు నియోజకవర్గంలో ఏం పని..? అని మీడియా ముందే తన అసంతృప్తిని వెల్లగక్కారు కూడా. అంతేకాదు సీఎం జగన్‌ను కలిసి ఈ విషయం తేల్చుకుంటానని కూడా చెప్పారు. ఈ వ్యవహారం జిల్లా మంత్రితో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రికి కూడా సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు.

Babu-on-Anuradha-winning.jpg

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!

టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపడంతో వైసీపీ అప్రమత్తమై తన పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టింది. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాదు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డే (YS Jagan Mohan Reddy) నేరుగా మాట్లాడినట్లు కూడా బయటికి వార్తలు వచ్చాయి. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు, వారి బంధువులతోనూ వైసీపీ హైకమాండ్ మాట్లాడింది. ఓటు వేయించే బాధ్యతను సీనియర్ నేతలకు సీఎం జగన్ అప్పగించారు. ఏడుగురు సీనియర్ నేతలకు ఒక్కొక్కరికి 22 మంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే బాధ్యత వైసీపీ అధిష్ఠానం కట్టబెట్టింది. సీనియర్ ఎమ్మెల్యేలకు తోడు కొంతమంది మంత్రులను వైసీపీ కేటాయించింది. బుధవారం (మార్చి-22న) రాత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులు డిన్నర్ కూడా ఇచ్చారు. సీన్ కట్ చేస్తే.. వైఎస్ జగన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఝలక్ ఇచ్చారు.

ఫోన్ స్విచాఫ్‌తో..!

మొత్తానికి చూస్తే.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కోడై కూస్తోంది. అధిష్టానం అనుమానం కూడా ఇదేనట. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలేం జరిగిందని ఆరా తీయడానికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేయగా.. స్విచాఫ్ రావడం గమనార్హం. దీంతో వైసీపీ పెద్దలకు మొదట అనుమానంగా మొదలై.. ఆ తర్వాత ఇద్దరు ఎవరనేది ఫుల్ క్లారిటీ వచ్చేసిందట. వాస్తవానికి.. సీక్రెట్ ఓటింగ్‌లో విప్ ఉండదు. ఇదే వైసీపీని దెబ్బ కొట్టిందని పక్కాగా అర్థమవుతోంది. అయితే.. ఈ ఓటమిపై వైసీపీ రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. క్రాస్ ఓటింగ్‌పై పార్టీలో చర్చిస్తామని.. ఎవరు తప్పు చేశారో తేలుస్తామని అధిష్టానం చెబుతోంది. క్రాస్ ఓటింగ్‌కు ఎవరు పాల్పడ్డారో తేలితే కఠిన చర్యలు ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. ఈ ఇద్దరేనా లేకుంటే మరెవరైనా ఉన్నారన్నది తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఫైనల్‌గా ఆ ఇద్దరు ఎవరో ఎప్పుడు తేలుతుందో మరి.

******************************

ఇది కూడా చదవండి..

******************************

MLC Elections Counting Live Updates : క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందెవరో తేల్చే పనిలో వైసీపీ అధిష్టానం.. ఎవరా ఎమ్మెల్యేలు..!

******************************

Updated Date - 2023-03-23T21:32:42+05:30 IST