AP Politics: జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటి? కారణం ఇదేనా?

ABN , First Publish Date - 2023-09-12T13:48:41+05:30 IST

బుధవారం నాడు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు జగన్ బిజీబిజీగా గడుపుతారని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జగన్ లండన్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందా.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి ఈ పరిమాణాలను వివరించనున్నారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

AP Politics: జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటి? కారణం ఇదేనా?

ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటన నుంచి రావడం, ఆయన స్పందన ఏంటనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. లండన్ నుంచి జగన్ ఆదేశాల మేరకే చంద్రబాబును ఇక్కడి పోలీసులు అరెస్ట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చీరాగానే ముఖ్య నేతలతో జగన్ సమీక్షించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, రిమాండ్‌కు పంపిన విధానం, అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ సమీక్షించినట్లు తెలుస్తోంది.

మరోవైపు బుధవారం నాడు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు జగన్ బిజీబిజీగా గడుపుతారని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జగన్ లండన్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందా.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి ఈ పరిమాణాలను వివరించనున్నారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జీ20 సమావేశాల బిజీలో ఉన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ అంశంపై మాత్రం స్పందించలేదు. దీంతో బాబు అరెస్ట్ అంశంపై జగన్ వాళ్లతో చర్చించనున్నట్లు కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో విదేశాల్లో కేమ్యాన్ ఐలాండ్స్ బ్యాంకు ప్రతినిధులతో జరిపిన నగదు లావాదేవీల అంశం గురించి మాట్లాడేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎందుకంటే లండన్ పర్యటన పేరుతో జగన్ కేమ్యాన్ ఐలాండ్స్‌కు వెళ్లారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ అంశంపై వైసీపీ నేతలు మాత్రం స్పందించలేదు.

ఇది కూడా చదవండి: NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం

అటు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతోందని కొద్దిరోజుల కిందట వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై కేంద్రంతో జగన్ చర్చలు జరుపుతారని సమాచారం అందుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబును మరిన్ని కేసుల్లో ఇరికించి రాజకీయంగా దెబ్బతీసేందుకు జగన్‌ను ఢిల్లీ పెద్దలు పిలిపించుకుంటున్నారా అనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి జగన్ ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో తెలియక వైసీపీ నేతలు కూడా అయోమయానికి గురవుతున్నారు.

Updated Date - 2023-09-12T13:48:41+05:30 IST