Janasena: ఏపీలో పోలీసుల తీరు ఇదే.. వీడియో షేర్ చేసిన కీలక నేత

ABN , First Publish Date - 2023-09-18T16:22:31+05:30 IST

ఏపీలో పోలీసులు ఎందుకు ప్రతిపక్షాల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారో తెలియజేస్తూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఏపీలో పోలీసులు వైసీపీ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Janasena: ఏపీలో పోలీసుల తీరు ఇదే.. వీడియో షేర్ చేసిన కీలక నేత

ఏపీలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్‌ను ఇంకా ఆ పార్టీ నేతలు మరిచిపోలేదు. తమ అధినేత అరెస్ట్‌కు సంఘీభావంగా నిరసన చేపట్టే అవకాశం ఇవ్వని పోలీసులు.. వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఏపీలో పోలీసులు ఎందుకు ప్రతిపక్షాల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారో తెలియజేస్తూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఏపీలో పోలీసులను చూస్తుంటే జాలేస్తోంది అంటూ పోస్ట్ చేయడంతో ఇప్పుడు సదరు వీడియో వైరల్‌గా మారింది.

ఇటీవల పోలీసులు ప్రతిపక్షాలకు చెందిన నేతలను విచ్చలవిడిగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పండగ పూట కుడా ఏంది ఈ హౌస్ అరెస్టులు అని పోలీసులతో వాగ్వాదానికి దిగిన తరుణంలో.. దండం పెట్టి దయచేసి అర్థం చేసుకోండి సార్.. పండగ పూట వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే మా ఉద్యోగం పోతుంది’ అంటూ ఓ పోలీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను జనసేన నేత కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీలో పోలీసులు వైసీపీ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ జగన్ సర్కారు చేపట్టిన చర్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP Politics: వైరల్ అవుతున్న ఆర్నాబ్-లోకేష్ చర్చ.. బ్రింగ్ ఇట్ ఇన్..!!

కాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ముందుగా అనుమతి తీసుకుని, ఆ తర్వాతే నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని.. క్రిమినల్ కేసులు నమోదైతే యువతకు ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2023-09-18T16:22:31+05:30 IST