TDP: మూడు నెలలుగా ఉన్న చిక్కుముడికి చెక్ పెట్టిన టీడీపీ..!

ABN , First Publish Date - 2023-06-28T17:56:37+05:30 IST

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ టీడీపీలో మూడు నెలలుగా ఉన్న చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు.

TDP: మూడు నెలలుగా ఉన్న చిక్కుముడికి చెక్ పెట్టిన టీడీపీ..!

రూరల్‌ అభ్యర్థిగా కోటంరెడ్డి !?

నియోజకవర్గ బాధ్యతలూ ఆయనకే..

టీడీపీలో స్పష్టత

అజీజ్‌కు సముచిత న్యాయం

సయోధ్య కుదిర్చిన నేతలు

పాదయాత్ర ఇన్‌చార్జిలుగా శ్రీధర్‌ బ్రదర్స్‌

జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల ఖరారు

యువగళం పూర్తయ్యేనాటికి మరికొన్నింటిలో క్లారిటీ

నెల్లూరు (ఆంధ్రజ్యోతి): నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ టీడీపీలో మూడు నెలలుగా ఉన్న చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు. రూరల్‌ నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర బాధ్యతలను కూడా కోటంరెడ్డి సోదరులకే అప్పగించారు. దీంతో రూరల్‌ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డేనన్న విషయం స్పష్టమైంది.

శ్రీధర్‌, అజీజ్‌ బాయి..బాయి

వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి టీడీపీ లో చేరడానికి రెండు నెలల క్రితమే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న అబ్దుల్‌ అజీజ్‌ కారణంగా చేరిక కాస్త ఆలస్యమైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డికి, అబ్దుల్‌ అజీజ్‌కు మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా వీరి మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మంగళవారం ఉదయానికి ఈ విషయంలో స్పష్టత వచ్చింది. చంద్రబాబు సూచనల మేరకు మంగళవారం ఉదయం బీద రవిచంద్ర నివాసంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, బీద రవిచంద్ర, కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు సమావేశమయ్యారు.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు. చేయి చేయి కలిపారు. భాయ్‌ భాయ్‌ అనిపించారు. అబ్దుల్‌ అజీజ్‌కు సముచిత న్యాయం జరుగుతుందని నాయకులు హామీ ఇచ్చారు. రూరల్‌ నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర బాధ్యతలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డిలకు అప్పగించారు. ఈ ప్రక్రియతో రూరల్‌ బాధ్యతలు కోటంరెడ్డికే అప్పగించినట్ల్లు అయింది. లోకేశ్‌ పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కలిసి నడవటం ద్వారా అధికారికంగా టీడీపీ రూరల్‌ పగ్గాలు చేపడుతారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ టీడీపీ అభ్యర్థిగా శ్రీధర్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

మరికొన్నింటిలోనూ క్లారిటీ

లోకేశ్‌ జిల్లాలో పాదయాత్ర ఆరంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది. జిల్లాలో పాదయాత్ర ముగిసేలోపు మరికొన్ని నియోజకర్గాల్లో అభ్యర్థుల విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై నెలాఖరు వరకు జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర కొనసాగుతుంది. అప్పటికే రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనే విషయంలో అధిష్ఠానం క్లారిటీకి వస్తుందని తెలిసింది.

ముగ్గురు అభ్యర్థుల ఖరారు

ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగే ముగ్గురు అభ్యర్థులు ఖరారయ్యారు. అధికారికంగా ప్రకటించక పోయినా ఈ ముగ్గురు అభ్యర్థులు మాత్రం 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి. నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేరును పార్టీ అధినేత చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. జిల్లా పార్టీ నాయకులతో జరిగిన అంతర్గత సమావేశంలో సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తారని చంద్రబాబు ఖరాకండిగా చెప్పారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

ఆత్మకూరులో జరిగిన లోకేశ్‌ పాదయాత్రకు ముందే రామనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆత్మకూరు నుంచి ఆనం పోటీ చేస్తారన్న విషయంలో ఏ మాత్రం అనుమానం లేదు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం విషయంలో కూడా మంగళవారానికి స్పష్టత వచ్చింది. ‘‘మీ అందరి సహకారంతో 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా’’....!!! అని ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగుచూసిన రోజు అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షరసత్యం కాబోతున్నాయి.

Updated Date - 2023-06-28T17:56:41+05:30 IST