Sridevi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి చేసింది తప్పేమి కాదంటూ నియోజకవర్గంలో చర్చ..!

ABN , First Publish Date - 2023-03-29T13:00:56+05:30 IST

ఊహించిన విధంగానే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. సీఎం జగన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ..

Sridevi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి చేసింది తప్పేమి కాదంటూ నియోజకవర్గంలో చర్చ..!

వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దళిత మహిళ ఆమె. తొలి నుంచి ఆమెను పార్టీలో అణగదొక్కే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ప్రజలు ఓట్ల ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ఉండగానే ఆ నియోజకవర్గంలో మరో ఇద్దరికి పెత్తనం అప్పగించారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వచ్చిన అవకాశాన్ని ఆ ఎమ్మెల్యే వాడుకుని... పార్టీ పెద్దలకు బుద్ధి చెప్పిందనే ప్రచారం జరుగుతుంది. ఇంతకెవరా ఎమ్మెల్యే? స్వంత పార్టీలో ఆమెకు జరిగిన అవమానాలేంటి? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-298.jpg

ఓటింగ్‌ అనంతరం అజ్ఞాతంలోకి శ్రీదేవి!

ఊహించిన విధంగానే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. సీఎం జగన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసిందని నిర్ధారణకొచ్చిన వైసీపీ పెద్దలు.. శ్రీదేవిని పార్టీ మంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి ఎవరికి అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే సమయంలో తాడికొండ నియోజకవర్గంలోని ఆమె వ్యతిరేక వర్గీయులు.. గుంటూరులోని కార్యాలయం వద్దకు వెళ్లి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించారు. అయితే.. జగన్ మెప్పు కోసమే ఆమె వ్యతిరేక వర్గీయులు ఈ దాడులకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రీదేవిని వ్యూహాత్మకంగానే పార్టీ నుంచి బయటకు పంపారని ఆమె అనుయాయులు వాపోతున్నారు.

Untitled-2887.jpg

రెండు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ శ్రేణులు

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరు సక్రమంగా లేదని భావించిన వైసీపీ అధిష్టానం.. ఆమె ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను.. తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా నియమించి.. శ్రీదేవిని బలహీనపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంతో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెండు గ్రూపులుగా వీడిపోయాయి. అనంతరం.. తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో పలుమారు కోట్లాటలు జరిగాయి. పార్టీని చక్కపరిచే పేరుతో ఆమె పవర్‌కు పగ్గాలు వేశారు. ఆ తర్వాత మరో నేత కత్తెర సురేశ్‌ను కూడా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా పార్టీ పెద్దలు నియమించారు. కత్తెర సురేష్ నియామకంతో ఉండవల్లి శ్రీదేవి, ఆమె వర్గం మరింత ఆగ్రహానికి గురైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా.. అదనపు సమన్వయకర్త పదవి కేవలం దళిత మహిళా ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గంలోనే సృష్టించడంతో ఎమ్మెల్యే తీవ్ర స్థాయి మనస్దాపం చెందారు. ఇదే విషయమై పలుమార్లు తాడేపల్లి పెద్దల వద్దకు వెళ్లిన ఆమెను అవమానించి పంపినట్లు ప్రచారం జరిగింది. పార్టీ పెద్దల తీరుతో లోలోన రగిలి పోతున్న ఎమ్మెల్యే శ్రీదేవి అవకాశం కోసం ఎదురు చూసినట్లు ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు పార్టీలో జరిగిన అవమానాలకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది.

444544.jpg

దళిత మహిళ కావడంతోనే అవమానించారని టాక్‌

ఉండవల్లి శ్రీదేవికి అదనపు సమన్వయకర్త పదవితోనే కాకుండా తొలి నుంచి ఆమెపై వేరే వాళ్లు పెత్తనం చేసే ప్రయత్నం చేశారు. తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవిని కాదని.. తొలి నుంచి బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేశ్‌ ను తాడేపల్లి పెద్దలు ప్రోత్సాహించారనే ప్రచారం జరిగింది. ఇలా ఎమ్మెల్యే శ్రీదేవికి తొలి నుంచి తన సొంత నియోజకవర్గంలో పార్టీ పెద్దల నుంచి వేధింపులు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. కేవలం దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా కావడంతోనే.. తాడేపల్లి పెద్దలు తొలి నుంచి అవమానకరంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసింది తప్పేమి కాదని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. మరి తాడికొండ నియోజవర్గంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Updated Date - 2023-03-29T13:05:41+05:30 IST