Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

ABN , First Publish Date - 2023-03-24T17:22:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే.

Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthy Anuradha) ఓటేయడంతో ఆమె గెలిచారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరని ఆరాతీసిన అధిష్ఠానం కనిపెట్టేసింది. ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వైసీపీ పెద్దలు సమాలోచనలు చేసి చివరికి పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీదేవిపై (Undavalli Sridevi) వేటుపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటినందుకు గాను వేటు వేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అధికారికంగా ప్రకటన చేశారు.

కోట్లు పెట్టి కొన్నారని ఆరోపణలు..!

క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా విచారణ చేశామన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారని ప్రాథమిక దర్యాప్తు తర్వాతే ఈ వేటు నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల స్పష్టం చేశారు. క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చి ఉండొచ్చన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) 15 నుంచి 20 కోట్లు వరకూ ఇచ్చారని సజ్జల ఆరోపించారు. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను కొన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. నెల్లూరుకు చెందిన ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ ఇప్పటికే వైసీపీకి రెబల్స్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదీ అసలు కథ..!

గురువారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ క్రాస్ ఓటింగ్ జరిగిందనే వార్తతో వైసీపీ శిబిరాల్లో ఆందోళన మొదలైంది. ఆఖరికి అదే నిజమైంది. ఫలితాలు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డేనని దాదాపు అధిష్ఠానం నిర్ధారణకు వచ్చింది. చివరికి ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఆ ఇద్దరే అని తేలడంతో 24 గంటలు కూడా గడవక ముందే వేటు వేస్తున్నట్లు సజ్జల ప్రకటన చేశారు. కాగా.. తాను క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం లేదని.. అలాంటి రాజకీయాలు చేయనని ఉండవల్లి శ్రీదేవి చెప్పుకొచ్చారు. అంతేకాదు గురువారం ఉదయమే కుమార్తెతో కలిసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఫొటోను కూడా శ్రీదేవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చివరికి అవన్నీ అబద్ధాలేనని ఇవాళ్టితో రుజువైపోయిందని వైసీపీ శ్రేణులు, శ్రీదేవి వీరాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మేకపాటి రియాక్షన్ ఇదీ..

మరోవైపు.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ నియోజకవర్గంలోని వైసీపీలో నాలుగు వర్గాలుగా విభజించి.. అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని అన్నారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌‌కే పేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందన్నారు. రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని... తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్ర సమస్యల్లో పడుతుందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ అధిష్టానం చెప్పిన వెంకటరమణకే ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించానన్నారు. ‘టిక్కెట్టు ఇస్తే గెలిచి చూపిస్తా... ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా’... అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో తానంటే గిట్టని వాళ్లు తనపై దుష్ప్రచారం చేసి, మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-03-24T17:35:38+05:30 IST