Karnataka State Elections: ‘నాటు నాటు’తో రంగంలోకి బీజేపీ.. అప్పట్లో కాంగ్రెస్‌కు ఏమైందంటే!

ABN , First Publish Date - 2023-04-13T15:54:51+05:30 IST

నాటు నాటు (Naatu Naatu).. ఇటీవల ఈ పాటకు లభించిన కీర్తి దేశంలో మరే పాటకు

 Karnataka State Elections: ‘నాటు నాటు’తో రంగంలోకి బీజేపీ.. అప్పట్లో కాంగ్రెస్‌కు ఏమైందంటే!

బెంగళూరు: నాటు నాటు (Naatu Naatu).. ఇటీవల ఈ పాటకు లభించిన కీర్తి దేశంలో మరే పాటకు లభించలేదు. ఆస్కార్ వేదికపై దుమ్ము రేపి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకున్న తర్వాత ఆ పాటకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇదే పాట. చివరికి రాయబార కార్యాలయ ఉద్యోగులు సైతం ఈ పాటకు స్టెప్టులేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పక్కర్లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాటకు పదం కలిపి ముచ్చట తీర్చుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లోనూ ఈ సాంగ్‌ను వినిపించారు.

bjp-and-congress.jpg

ఇప్పుడీ పాట రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీ ఈ పాటతో విస్తృత ప్రచారం చేస్తోంది. ‘నాటు నాటు’ స్థానంలో ‘మోదీ మోదీ’ని చేర్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.

టీ విక్రయించే వ్యక్తి ఒకరు తన దుకాణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) పోస్టర్‌ను అతికిస్తుంటాడు. అది చూసిన వినియోగదారుడు ఎందుకిలా? అని ప్రశ్నించడంతో ట్రాక్ ప్రారంభమవుతుంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ ఈ పాటను రీమిక్స్ చేశారు. బీజేవైఎం(BJYM) యువజన విభాగం ఆలోచన నుంచే ఈ పాట పుట్టిందన్నారు. పాటలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. అలాగే, శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో లైన్, గత మూడేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పాటలో చేర్చారు. ‘నాటు నాటు’ పాటకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను ఈ రకంగా వాడుకుని లాభపడాలని బీజేపీ చూస్తోంది.

కేజీఎఫ్‌ పాటను వాడుకున్న కాంగ్రెస్‌కు షాక్

rahul.jpg

కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల చేపట్టిన ‘భారత్ జోడో’(Bharat Jodo Yatra) యాత్ర వీడియోలకు కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను కాంగ్రెస్ వాడుకుంది. ఈ వీడియోలు కూడా జనంలోకి బాగా చొచ్చుకెళ్లాయి. అవి కూడా బాగానే వైరల్ అయ్యాయి. అయితే, ఈ పాటలపై పూర్తి హక్కులు తమవేనని, అనుమతి లేకుండా కాంగ్రెస్ తమ పాటలను వాడుకుందంటూ రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటేలపై ఎమ్మార్టీ మ్యూజిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒరిజినల్ వెర్షన్‌ను కొన్ని మార్పులతో ఉపయోగించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కాపీరైట్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై బెంగళూరు కోర్టులో విచారణ కూడా జరిగింది. విచారణ అనంతరం భారత్ జోడో ట్విట్టర్ ఖాతాతోపాటు, కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ రకమైన మార్కెటింగ్ వీడియోలు పైరసీకి బూస్ట్ ఇస్తాయని కోర్టు అభిప్రాయపడింది.

kgf.jpg

మరిప్పుడు బీజేపీ సంగతేంటి?

కేజీఎఫ్-2 పాటలను వాడుకోవడం ద్వారా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంది. మరి ఇప్పుడు ‘నాటనాటు’ పాటను వాడుకున్న బీజేపీకి కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందా? అన్న విషయం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉండడంతో ఆ పార్టీపై ఫిర్యాదు చేయగలిగారని, కానీ అధికారంలో ఉన్న బీజేపీపై ఫిర్యాదు చేసే దమ్ము ఎవరికైనా ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ పాటలపై ఫిర్యాదు చేసినా, కాంగ్రెస్ విషయంలో స్పందించినట్టుగానే కోర్టులు స్పందిస్తాయా? అని కూడా చర్చించుకుంటున్నారు.

మే 10న ఒకే దశలో..

కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే (13న) ప్రారంభమైంది. 20వ తేదీ వరకు కొనసాగుతుంది. మే 13న ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

Updated Date - 2023-04-13T16:21:32+05:30 IST