Etela Rajender Ponguleti: గన్‌మెన్లు కూడా లేకుండా ఈటల రాజేందర్, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ

ABN , First Publish Date - 2023-05-25T18:22:49+05:30 IST

ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నగర్‌కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారా?.. లేదా కొత్తగా పార్టీని స్థాపించబోతున్నారా? అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది.

Etela Rajender Ponguleti: గన్‌మెన్లు కూడా లేకుండా ఈటల రాజేందర్, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ

హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Pongulati Srinivas reddy), నగర్‌కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna rao) ఏ పార్టీలో చేరబోతున్నారు?.. లేదా సొంతంగా పార్టీని స్థాపించబోతున్నారా? అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్, పొంగులే, జూపల్లి మధ్య రహస్య భేటీ జరుగుతోంది. ఈటలకు చెందిన ఈ ఫామ్‌‌హౌస్‌లో దాదాపు 4 గంటలకుపైగా సమయం నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది. అనుచరులు, అనుయాయులు, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా అత్యంత రహస్యంగా ఈ భేటీని కొనసాగుతున్నారు. దీంతో ఈ సమావేశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంత సీక్రెట్‌గా సమావేశమవడానికి గల కారణాలు ఏంటనే దానిపై చర్చ మొదలైంది.

అందుకోసమేనా...

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ (BJP) నాయకత్వం పట్టువిడవకుండా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గురువారం రహస్య భేటీకి కారణమనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ చేరిక కమిటీ ఇదివరకే ఖమ్మం వెళ్లి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సంప్రదింపులు జరిపింది. అప్పుడు అందరి ముందు బహిరంగంగానే చర్చలు జరిగాయి. ఆలోచించుకుని తర్వాత నిర్ణయం చెబుతామని వారిద్దరూ స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సమావేశం అత్యంత రహస్యంగా జరుగుతుండడమే రాజకీయంగా ఆసక్తికలిగించడానికి కారణమవుతోంది. వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఈటల చర్చలు జరుపుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ... పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఇందులో భాగంగానే ఈటలను రహస్యంగా కలిశా? అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా వీరిద్దరినీ ఈటల బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? లేక ఈటలనే తమ కొత్త పార్టీలోకి ఆహ్వానించారా? అనే ఆసక్తికర విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

దూకుడు పెంచిన ఈటల...

ఈటల రాజేందర్ కొన్నిరోజుల కింద ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ నాయకులు నడ్డా, సునీల్ బన్సల్‌ను కలిసి వచ్చాక దూకుడు పెంచారు. వాస్తవానికి చేరికల కమిటీగా హెడ్‌గా ఈటల దాదాపు ఏడాదిగా కొనసాగుతున్నప్పటికీ నాయకత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ విషయంలో అధిష్ఠానం సీరియస్‌గా ఉందని చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడిని వదులుకోవడానికి అధిష్ఠానం ఏమాత్రం ఇష్టపడడం లేదని సమాచారం. దీంతో పొంగులేటి, జూపల్లి డిమాండ్లకు ఏదో విధంగా ఒప్పించి పార్టీలో చేర్పించే దిశగానే ఈటల సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధిష్ఠానం నుంచి బలమైన హామీ వచ్చిన నేపథ్యంలో గత 4 గంటలుగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నేతలిద్దరి అడుగులు ఏ పార్టీవైపు పడుతున్నాయన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, వారి డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకారం తెలిపిందని పెద్ద చర్చ నడిచింది. మరి ఈ రహష్య భేటీలో ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Updated Date - 2023-05-25T18:25:07+05:30 IST