Brs vs Congress: బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాం..ఇంతకీ ఆ కసరత్తు ఏంటంటే..?

ABN , First Publish Date - 2023-03-25T12:27:55+05:30 IST

ఎన్నికల మేనేజ్మెంట్‌లో ఆరితేరిన అధికార బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ అంతకు మించిన వ్యూహాన్ని

Brs vs Congress: బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాం..ఇంతకీ ఆ కసరత్తు ఏంటంటే..?

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడుతోందా! దళిత, గిరిజన నినాదానికి సమర్థులైన నేతలు తోడైతే క్లిన్ స్వీప్ చేయొచ్చని భావిస్తోందా! ఇంతకీ ఆయా నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం ఏంటి! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది! అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం...

Untitled-854.jpg

పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు

ఎన్నికల మేనేజ్మెంట్‌లో ఆరితేరిన అధికార బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ అంతకు మించిన వ్యూహాన్ని ఇప్పటి నుంచే అమలు చేస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడిలా.. బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోందట. ముఖ్యంగా ఎస్సీ-ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్ సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. మొత్తం సీట్లను కైవసం చేసుకునేలా.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ఎస్టీ నియోజకవర్గాల నుంచే పాదయాత్రలు ప్రారంభించారన్న చర్చ సాగుతోంది.

Untitled-13454.jpg

20కి పైగా స్థానాల్లో గెలుపు ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో ప్రస్తుతం 31 రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. అందులో 19 సీట్లు ఎస్సీ, 12 సీట్లు ఎస్టీ రిజర్వుడు కాగా.. గడిచిన ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గాల కన్నా....ఈ రిజర్వుడు నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కువ ఫోకస్ పెట్టింది. విపక్ష అభ్యర్థులు కలలో కూడా అంచనా వేయని విధంగా భారీగా ఖర్చు పెట్టింది. గెలుపు కష్టం అనుకున్న కొన్ని చోట్ల జనరల్ నియోజకవర్గాల కంటే ఎక్కువ వెచ్చించారు. దీంతో చాలా చోట్ల మిగతా పార్టీల అభ్యర్థులు మధ్యలోనే చేతులెత్తేశారు. అయినా కాంగ్రెస్ దక్కించుకున్న 19 అసెంబ్లీ స్థానాల్లో 7 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లే. పైగా ఎస్టీ రిజర్వుడు సీట్లు అయిన వైరాలోనూ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థే గెలిచారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమి తరపున టీడీపీ గెలుచుకున్న 2 సీట్లు కూడా రిజర్వుడు సీట్లే. అంతటి హవాలోనూ గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో... ఇప్పటి నుంచే సరైన నేతలను ప్రోత్సహిస్తే 20కి పైగా రిజర్వుడు స్థానాల్లో జెండా పాతడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోందట.

Untitled-954.jpg

దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్ర సక్సెస్

వాస్తవానికి ఇందిరాగాంధీ హయాం నుంచీ తెలంగాణలోని దళిత, గిరిజన వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ వర్గాల్లోని సంప్రదాయ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతో పాటు కొత్త ఓటర్లలో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పడిందట. ఆయా వర్గాలను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్‌ తలపెట్టిన దళితబంధు పథకానికి కౌంటర్‌గా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్ర సక్సెస్ అయింది. దళితులతో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలన్న డిమాండ్‌కు ఆయా వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన ప్రారంభ సభ అప్పట్లో కాంగ్రెస్‌లో జోష్ నింపింది. ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ దళిత, గిరిజనులను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాగే ఫైట్ చేస్తే ఆయా స్థానాల్లో బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోందట.

Untitled-11544.jpg

ఇప్పటికీ బలం ఉందని కాంగ్రెస్‌లో నమ్మకం

ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 ఎస్టీ, 2 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. వీటిలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2018లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. ఆ తర్వాత కొన్నాళ్ళకే గులాబీ గూటికి చేరిపోయారు. బోథ్ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సోయం బాపురావు.. ఆ తర్వాత బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. చెన్నూరు నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన వెంకటేష్...ఆ తర్వాత గులాబీ గూటికి చేరి పెద్దపల్లి ఎంపీ అయ్యారు. ఖానాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి రమేష్ రాథోడ్ కొన్నాళ్ళ క్రితం బీజేపీలో చేరారు. ఒక మిగిలిన బెల్లంపల్లిని గతంలో పొత్తులో భాగంగా సిపిఐకి ఇచ్చి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ బలం ఉందని కాంగ్రెస్ నమ్ముతోంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బులను వెదజల్లి రాజకీయం చేస్తోందని..అంతకు మించి బలమేమి లేదన్న అంచనాకు కాంగ్రెస్ వచ్చిందట.

Untitled-12045.jpg

సీనియర్ల మధ్య ఆధిపత్య పోరుతోనే నష్టం!

అయితే... కాంగ్రెస్ అంచనా బాగానే ఉన్నా.. వర్గపోరు మళ్లీ దెబ్బ తీసేలా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ ఉంది. గత ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులే కాంగ్రెస్‌ను ముంచేశారు. సీనియర్ల మధ్య ఆధిపత్య పోరుతోనే నష్టం జరిగినట్టు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదని, గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని భరోసా ఇస్తోంది. మొత్తానికి పోయిన చోటే వెతుక్కోవాలన్న కసి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. మెజార్టీ రిజర్వుడు స్థానాలను గెలిస్తే...అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతోంది. మరి.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2023-03-25T12:27:55+05:30 IST