AP Politcs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అంబటి రాయుడు ఫొటో.. అసలు విషయమేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-01T17:57:28+05:30 IST

అవును.. క్రికెట్‌కు (Cricket) రిటైర్మెంట్ ప్రకటించిన అంబటిరాయుడు (Ambati Rayudu) పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు.. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు.. ఎన్నికల ముందు నుంచే పక్కా ప్లాన్‌తో క్రికెట్ పిచ్ నుంచి పాలిటిక్స్‌లోకి దిగిపోయారు..

AP Politcs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అంబటి రాయుడు ఫొటో.. అసలు విషయమేంటో తెలిస్తే..!

అవును.. క్రికెట్‌కు (Cricket) రిటైర్మెంట్ ప్రకటించిన అంబటిరాయుడు (Ambati Rayudu) పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు.. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు.. ఎన్నికల ముందు నుంచే పక్కా ప్లాన్‌తో క్రికెట్ పిచ్ నుంచి పాలిటిక్స్‌లోకి దిగిపోయారు. రాయుడిది గుంటూరు జిల్లా (Guntur Dist) కావడంతో ఇక్కడ్నుంచే పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని వర్గాలకు దగ్గరవ్వడానికి అంబటి నియోజకవర్గాల బాట పట్టారు. రైతులు, విద్యార్థుల కష్టాలను తెలుసుకుంటూ బాధలు తీరుస్తానంటూ పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉన్నాయ్..? పథకాలు అందరికీ అందుతున్నాయా..? అని జనాలను అడిగి తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చేముందు ఎవరికైనా మామూలేకానీ రాయుడు దిగిన ఒక్క ఫొటో మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెగ చర్చనీయాంశం అవుతోంది.. ఇంతకీ ఏమిటా ఫొటో..? దీని వెనకున్న కథేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Ambati-With-Students.jpg

ఫొటో పే చర్చ..!

ఏపీలో ఇప్పుడు ‘కాపు’ రాజకీయం (Kapu Politics) నడుస్తోంది. ఓ వైపు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) లేఖలతో కాక పుట్టిస్తుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు ముందుకెళ్తుండగా.. ఇప్పుడు అంబటి రాయుడు కూడా రంగంలోకి దిగిపోయారు. రాయుడిది.. కాపు సామాజిక వర్గం కావడంతో అప్పుడే ‘కాపు కార్డు’ పట్టేశారు. రెండ్రోజుల క్రితం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా .. కాపులంతా ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగా (Vangaveeti Ranga) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విగ్రహం దగ్గర దిగిన ఒక ఫొటో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే ఈ ఫొటో గురించే చర్చ నడుస్తోంది. కొందరు రాయుడికి అనుకూలంగా కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరేమో తిట్టిపోస్తున్నారు. రాయుడు కూడా బహుశా వంగవీటిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నట్లు సభ్య సమాజానికి చెప్పాలనుకున్నారేమో తెలియట్లేదుగానీ ఈ ఫొటో చర్చనీయాంశం అయ్యింది.

Rayudu-At-Ranga-Statue.jpg

ఇప్పుడే ఈ పర్యటన ఎందుకో..?

త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది రాయుడి ఆలోచన. ఇందుకోసం ఇప్పట్నుంచే ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఫలానా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు కానీ.. ఆయన పర్యటన, మాట తీరు, పొగడ్తలు అన్నీ చూస్తుంటే వైసీపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఆ మధ్య ఒకట్రెండు సార్లు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి మరీ వైఎస్ జగన్‌ను (CM YS Jagan Reddy) కలవడంతో పక్కాగా వైసీపీ (YSR Congress) కండువా కప్పుకుంటారని అర్థమవుతోంది. అంతేకాదు.. గుంటూరు ఎంపీగా పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు నుంచి ఎంపీగా (Guntur MP) పోటీచేయడానికి వైసీపీకి సరైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో పోటీచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (Modugula Venugopala Reddy) రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. సరిగ్గా ఇదే సమయంలో అంబటిరాయుడు రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేసిన ప్రకటన వైసీపీకి కలిసొచ్చింది. ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని జగన్ సూచన మేరకే రాయుడు ఇలా పర్యటిస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. ముఖ్యంగా.. ఏపీలో గెలుపు, ఓటములను నిర్ణయించేది కాపు సామాజిక వర్గం అనే విషయం తెలిసిందే. రాయుడు ఇదే సామాజిక వర్గం కావడంతో పక్కా ప్లాన్‌తో కాపు కార్డుతో వెళ్తున్నారని అర్థమవుతోంది. ఎన్నికలకు ముందే జనాల్లో తిరగడం, సమస్యలు తెలుసుని పరిష్కార మార్గం చూపించడం, వంగవీటి విగ్రహానికి నివాళులు అర్పించడం ఇవన్నీ చూస్తుంటే రాయుడు రాజకీయాలను బాగానే వంటపట్టించుకున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. స్టార్ క్యాంపెయినర్‌గా కాపు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని కూడా వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Rayudu-and-Jagan.jpg

పోటీ ఎక్కడ్నుంచో..?

ఉమ్మడి గోదావరి జిల్లాల (Godavari Districts) తర్వాత కాపు ఓట్లు ఎక్కువగా ఉండేది విజయవాడ, గుంటూరు (Guntur, Vijayawada) జిల్లాల్లోనే. వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో పట్టు బాగానే ఉందని చెప్పుకుంటున్నప్పటికీ కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గుర్రున ఉన్నారు. అందుకే వారిని వైసీపీ వైపు తిప్పుకోవడానికి యూత్‌లో ఫాలోయింగ్, అదే సామాజిక వర్గానికి చెందిన రాయుడిని అధిష్టానం రంగంలోకి దింపుతోందన్న టాక్ కూడా నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గుంటూరు ఎంపీగా పరిస్థితులు అనుకూలించకపోతే విజయవాడ ఎంపీగా (Vijayawada MP) పోటీచేయించాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారట. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ్నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన పీవీపీ (PVP) ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. సరైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించింది. ఇది కూడా రాయుడికి ఒక ఆప్షన్‌గా ఉందట. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అయితే ఇందులో పొన్నూరు, తెనాలి, మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో అధికంగా కాపు ఓటర్లు ఉన్నారు. అందుకే ఇక్కడ్నుంచే రాయుడు కూడా తన పర్యటన మొదలుపెట్టారు. గుంటూరు ఎంపీ సీటు కన్ఫామ్ అయ్యింది కాబట్టే రాయుడు ఇలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని కూడా చర్చ సాగుతోంది. మరోవైపు.. గుంటూరు పశ్చిమ, బందరు పార్లమెంట్ స్థానంలో పోటీపైన కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Rayudu-Ambati.jpg

మొత్తానికి చూస్తే.. పిచ్ నుంచి పాలిటిక్స్‌లోకి (Pitch To Politics) వస్తున్న రాయుడు ఇన్నింగ్స్ మొదలెట్టేశారు. ఇప్పటికైతే వైసీపీకి సపోర్టుగానే మాట్లాడుతూ ముందుకెళ్తున్న ఈ మాజీ క్రికెటర్.. ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఒకవేళ వైసీపీలో చేరితే ఏ మాత్రం ప్రాధాన్యం ఉంటుంది..? చేరిక వరకేనా లేకుంటే ఇప్పుడు హడావుడి జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీచేస్తారా..? రాయుడినే నమ్ముకుని రంగంలోకి దింపాలనుకుంటున్న వైసీపీ వ్యూహం ఏ మాత్రం వర్కవుట్ అవుతుంది..? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


Ambati Rayudu : ‘అంబటి’ అడుగులు ఎటువైపు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ కేక్‌గా మారిన రాయుడు.. వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేస్తారన్న వార్తల్లో నిజమెంత..?


Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?



Updated Date - 2023-07-01T18:06:19+05:30 IST