TAS-UK: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఉగాది సంబరాలు

ABN , First Publish Date - 2023-03-30T12:30:05+05:30 IST

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS-UK) ఎడిన్‌బర్గ్‌లో మార్చి 25న డాల్‌కీత్ కమ్యూనిటీ క్యాంపస్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది.

TAS-UK: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఉగాది సంబరాలు

ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్ (యూకే): యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS-UK) ఎడిన్‌బర్గ్‌లో మార్చి 25న డాల్‌కీత్ కమ్యూనిటీ క్యాంపస్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది. 300 మందికి పైగా హాజరైన అతిథులు, ప్రవాసులు వివిధ ప్రదర్శనలు, కార్యక్రమాలను ఆస్వాదించారు. టాస్-యూకేకి చెందిన విజయ్ కుమార్ పర్రి ప్రేక్షకులకు, అతిథులకు శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరంజన్ నూక, రాజశేఖర్ సాంబ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి అందరినీ సాదరంగా ఆహ్వానించారు. మ.12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సా.6 గంటల వరకు కొనసాగింది. ఇందులో కనులవిందైన సాంస్కృతిక మరియు పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు, సినీ, సాంస్కృతిక సంగీతాలాపనలు, స్టాండ్-అప్ కామెడీ ప్రదర్శనలతో ఆద్యంతం వినోదం పంచింది. ఉగాది పండుగ నేపథ్య ప్రసంగం, తదుపరి పంచాంగ పఠనం ప్రత్యేకంగా నిలిచాయి.

ముఖ్య అతిథిగా హాజరైన భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్‌ను మైథిలి కెంబూరి, శివ చింపిరి ఘనంగా సత్కరించారు. అనంతరం బిజయ్ మాట్లాడుతూ.. తెలుగు నేర్పించడం, సైకిల్ ప్రోగ్రామ్‌ల మీద TAS-UK చేస్తున్న కృషిని కొనియాడారు. సితార్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. భాషా సంబంధిత కార్యకలాపాల ద్వారా తెలుగును బోధించడానికి, ప్రోత్సహించడానికి టాస్-యూకే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం కోర్సును పూర్తి చేసిన సిలికాన్ ఆంధ్ర మనబడి విద్యార్థులకు మాధవిలత ధృవపత్రాలను అందజేశారు. ఇంత అత్యద్భుతంగా సాగిన ఈ కార్యక్రమానికి పండరి జైన్ కుమార్ ఈవెంట్ పబ్లిసిటీ మరియు ఐటీకి సహకరించగా, సాంస్కృతిక ప్రదర్శన సమన్వయంలో బాలాజీ కర్నాటి సహకరించారు. నరేష్ డీకొండ, జాకీర్ షేక్, వెంకటేష్ గడ్డం లాజిస్టిక్స్ సమకూర్చడంలో తమవంతు సహకారం అందించారు.

ఇక ఈ కార్యక్రమానికి హాజరైన వారి నుండి అద్భుతమైన స్పందన రావడంతో ఈవెంట్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉదయ్ కుమార్ కూచాడి ప్రదర్శకులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, ముఖ్య అతిథి, అలాగే అన్ని ఇతర పొరుగు సంఘాల నుండి వచ్చిన అతిథులతో సహా ఈవెంట్ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారత జాతీయ గీతం జనగణ మనతో కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. కాగా, గత యేడాది టాస్-యూకే 20 వసంతాలను పూర్తిచేసుకొని ఘన సంబరాలను జరుపుకోవడం అందరికీ తెలిసిందే.

Updated Date - 2023-03-30T12:30:05+05:30 IST