Eric Adams: వలసదారులపై న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు.. నగరం నిండిపోయిందంటూ..

ABN , First Publish Date - 2023-07-22T10:15:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric Adams) తాజాగా వలసదారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Eric Adams: వలసదారులపై న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు.. నగరం నిండిపోయిందంటూ..

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric Adams) తాజాగా వలసదారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ నగరం నిండిపోయిందని, కొత్తగా ఇక్కడికి వచ్చే వారికి ఆశ్రయం, సర్వీసులను అందించలేమన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి న్యూయార్క్ సిటీ కొత్తగా 90వేల మంది వలసదారులకు స్వాగతం పలికిందని మేయర్ తెలిపారు. వీరిలో 40వేల మంది వరకు అక్రమంగా నగరంలో ప్రవేశించినట్లు ఆయన పేర్కొన్నారు. కొద్దినెలల క్రితమే తాము నగరం నిండుతున్నట్లు చెప్పామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూయార్క్ నగరంలో ఇక స్థలం ఖాళీగా లేదని, మాకిప్పుడు సహాయం కావాలని వాషింగ్టన్ డీసీలో జరిగిన మేయర్స్ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు.

న్యూయార్క్‌లో హౌసింగ్ చాలా ఖరీదైనదని పేర్కొన్న ఆయన.. నగరంలో ఆహారం, రవాణా, ఇతర సదుపాయాలకు వెచ్చించే మొత్తం అనేది దేశంలోని మిగిలిన నగరాల కంటే చాలా ఎక్కువగా ఉందన్నారు. ఇక వలస సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రూపొందించిన కొత్త ప్రణాళిక ప్రకారం.. ఒంటరి వయోజనులు రెండు నెలలు మాత్రమే నగరంలోని షెల్టర్లలో ఉండగలరని తెలిపారు. ఆ తర్వాత తప్పనిసరిగా కొత్తగా ఆశ్రయం కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మేయర్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కాగా, పొలిటికో నివేదిక ప్రకారం దక్షిణ అమెరికా దేశాలు, చైనా తదితర దేశాలకు చెందిన వలసదారులకు న్యూయార్క్‌లో పునరావాసం ఏర్పాటు చేయడానికి ఏప్రిల్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు సుమారు 50వేల డాలర్లకు పైగా ఖర్చు చేశారు.

Indian Citizenship: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 17.50 లక్షల మంది..!

Updated Date - 2023-07-22T10:16:45+05:30 IST