Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

ABN , First Publish Date - 2023-08-25T09:40:02+05:30 IST

భారత్-చైనా మధ్య సత్సంబంధాలు మెరుగుపడటం వల్ల ఇరు దేశాలతోపాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు జరుగుతుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు. ఇది ప్రపంచ, ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని తెలిపారు.

Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సత్సంబంధాలు మెరుగుపడటం వల్ల ఇరు దేశాలతోపాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు జరుగుతుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు. ఇది ప్రపంచ, ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని తెలిపారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతూ జీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాలను చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు (BRICS Summit) నేపథ్యంలో మోదీ (Prime Minister Narendra Modi), జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) ద్వైపాక్షిక చర్చలు జరిపారని ఈ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత చైనా-భారత్ సంబంధాలపై ఇరువురు నేతలు లోతుగా తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఇరు దేశాలకు ఆసక్తిగల ఇతర అంశాలపై కూడా మాట్లాడారని తెలిపారు.

చైనా-భారత్ సంబంధాలు మెరుగుపడటం వల్ల ఇరు దేశాలు, ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు జరుగుతుందని జీ జిన్‌పింగ్ నొక్కి వక్కాణించారని చెప్పారు. సత్సంబంధాలు మెరుగుపడితే ప్రపంచం, ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడానికి, శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని చెప్పారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యాలను ఉమ్మడిగా పరిరక్షించుకోవడానికి వీలుగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ ప్రకటన తెలిపింది.


బ్రిక్స్ సదస్సులో గురువారం మోదీ, జిన్‌పింగ్ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ వేదికపైకి వెళ్లేటపుడు పక్కపక్కనే నడుస్తూ క్లుప్తంగా మాట్లాడుకున్నట్లు కనిపించింది. దీనిపై భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా తెలిపిన వివరాల ప్రకారం, వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వెస్టర్న్ సెక్టర్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పట్ల భారత దేశ ఆందోళనను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు.

తూర్పు లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలు 2020 మే నెలలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మోదీ, జిన్‌పింగ్ 2022 నవంబరులో ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సు సందర్భంగా కలిశారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించవలసిన అవసరం గురించి జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3: ల్యాండర్, రోవర్‌ల 14 రోజుల కథ.. ఆ కాలపరిమితి వెనుక స్టోరీ ఏంటి? ఆ తర్వాత ఏమవుతుంది?

Chennai: గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శన

Updated Date - 2023-08-25T09:40:02+05:30 IST