Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

ABN , First Publish Date - 2023-07-28T14:58:10+05:30 IST

మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ తగులబడుతోందని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతం, వర్తమానం మధ్య తేడాను కొందరు రాజకీయ విశ్లేషకులు వివరించారు.

2010 నుంచి 2017 మధ్య కాలంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి దాదాపు 30 రోజుల నుంచి 139 రోజుల వరకు మణిపూర్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ సమయంలో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండేవి. పెట్రోలు ధర లీటరు రూ.240కి, వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,900కు చేరుతుండేది. వీటిని కొనాలంటే కళ్ల వెంబడి రక్తం చుక్కలు పడినట్లయ్యేది. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో ఇంఫాల్ లోయలో ఓ విద్యార్థి మరణించడంతో మణిపూర్‌లో మూడు నెలలకుపైగా నిరసనలు, ప్రతిష్టంభన ఏర్పడింది.

వర్తమానాన్ని పరిశీలిస్తే, నిరాశ్రయులైనవారికి ఆహారం, ఇతర సదుపాయాలు పుష్కలంగా అందుబాటులో ఉంచారు. భారత ఆహార సంస్థ (FCI) ద్వారా ప్రతి శిబిరంలోనూ 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజల పునరావాసం, సహాయం కోసం రూ.101.75 కోట్లు తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.


తాజా ఘర్షణలు ప్రారంభమైన మే 3 నుంచే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మణిపూర్ ఉన్నతాధికారులతో సమన్వయం కుదుర్చుకుని, కేంద్ర బలగాలను పంపించింది. ఆ తర్వాత అదనంగా 124 కంపెనీల సీఏపీఎఫ్, 184 కాలమ్స్ ఇండియన్ ఆర్మీ/అస్సాం రైఫిల్స్ దళాలను పంపించింది. ప్రజల భద్రత కోసం హెలికాప్టర్లు, డ్రోన్లను పంపించింది.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుల్దీప్ సింగ్‌ను మణిపూర్ భద్రతా సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది, ఆయన మే 4న పదవీ బాధ్యతలను చేపట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషీని కేంద్ర ప్రభుత్వం నుంచి తిరిగి రాష్ట్రానికి రప్పించి, మే 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తగినన్ని నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మే 29 నుంచి జూన్ 1 వరకు మణిపూర్‌లో బస చేసి, అన్ని వర్గాలతో చర్చలు జరిపారు. ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలు, రాజకీయ నేతలు, పౌర సమాజంలోని సంఘాలతో 15కుపైగా సమావేశాలను నిర్వహించారు. హింసాత్మ సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక శిబిరాలను సందర్శించారు. ఘర్షణల ప్రభావంతో బాధపడుతున్న వివిధ వర్గాలు, తెగల ప్రజలను కలుసుకున్నారు.


విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు కేసులపై దర్యాప్తు బాధ్యతను స్పెషల్ సీబీఐ టీమ్‌కు అప్పగించారు.

ఘర్షణల చరిత్ర

మణిపూర్‌లో ఈ ఏడాది మే 3 నుంచి 5 వరకు 59 మంది, మే 27 నుంచి 29 వరకు 28 మంది, జూన్ 13న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 502 మంది గాయపడ్డారు. 5,101 గృహదహనం సంఘటనల్లో 6,065 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. 252 మందిని అరెస్ట్ చేయగా, 12,740 మందిని నిరోధక నిర్బంధం క్రింద అదుపులోకి తీసుకున్నారు.

కుకీ-నాగా తెగల మధ్య 1993 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఘర్షణల్లో 350కిపైగా గ్రామాలు సర్వనాశనమయ్యాయి. సుమారు 750 మంది మరణించారు. అదే సంవత్సరం డిసెంబరు వరకు తీవ్రమైన హింసాత్మక సంఘటనలు కొనసాగాయి. 1998 వరకు చెదురుమదురు సంఘటనలు జరిగాయి.

1997-98లో కుకీ-పెయిటీ తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 50కిపైగా గ్రామాలు నాశనమయ్యాయి. సుమారు 13 వేల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 352 మంది మరణించారు. 136 మంది గాయపడ్డారు.


ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర : అమిత్ షా

Congress Vs BJP : మహాభారతంలో ‘లవ్ జీహాద్’ ఉందన్న కాంగ్రెస్ నేత.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిమంత బిశ్వ శర్మ..

Updated Date - 2023-07-28T14:58:10+05:30 IST