Akhilesh Yadav: అఖిలేష్ కాన్వాయ్లో ప్రమాదం.. ఎస్పీ చీఫ్ సేవ్..
ABN , First Publish Date - 2023-02-03T19:11:09+05:30 IST
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాన్వాయ్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఫర్హత్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద కాన్వాయ్ను..
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కాన్వాయ్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఫర్హత్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద కాన్వాయ్ను అనుసరిస్తున్న పార్టీ కార్యకర్తల వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అఖిలేష్ యాదవ్ వాహనానికి ఎలాంటి డ్యామేజ్ జరగకపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఘటన అనంతరం ఆయన షెడ్యూల్ ప్రకారం తన ప్రోగ్రామ్కు బయలుదేరి వెళ్లారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అఖిలేష్ యాదవ్ మల్లవాన్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై బైతాపూర్ గ్రామానికి బయలుదేరారు. అకస్మాత్తుగా రోడ్డుపైకి ఏదో వాహనం రావడంతో అఖిలేష్ కాన్వాయ్ వెంట వస్తున్న ఓ వాహనానికి షెడన్ బ్రేక్ పడింది. దీంతో ఆ వాహనాన్ని మరికొన్ని వాహనాలు ఢీకొన్నాయి. సుమారు డజను వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఉన్నాతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ వెంట వచ్చిన ఆయన మద్దతుదారుల వాహనాలు రైల్వే క్రాసింగ్ వద్ద వేగంగా వస్తూ ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుందని ఈస్ట్ర్రన్ ఏసీపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రమాద స్థలికి పోలీసులతో సహా అంబులెన్స్ చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అఖిలేష్ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన యథాప్రకారం తన కార్యక్రమానికి వెళ్లిపోయారని తెలిపారు.
కాగా, దీనికి ముందు అఖిలేష్ యాదవ్ మొరాదాబాద్ పర్యటన విషయం గురువారం చర్చకు వచ్చింది. యోగి ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అఖిలేష్ మొరాదాబాద్ పర్యటనను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అనుమతించడం లేదని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. ముందుగానే ఖరారైన కార్యక్రమాన్ని అనుమంతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొంది.