Land Mafia: టీచర్ ఉద్యోగం వదిలి 27 ఏళ్లుగా...
ABN , First Publish Date - 2023-03-07T20:59:50+05:30 IST
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో భూ కబ్జా (Land Mafia) మాఫియాలకు వ్యతిరేకంగా విజయ్ సింగ్(Vijay Singh) అనే వ్యక్తి 27 సంవత్సరాలుగా ధర్నా చేస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో భూ కబ్జా (Land Mafia) మాఫియాలకు వ్యతిరేకంగా విజయ్ సింగ్(Vijay Singh) అనే వ్యక్తి 27 సంవత్సరాలుగా ధర్నా చేస్తున్నారు. ముజఫర్నగర్ (Muzaffarnagar) శివ్చౌక్(Shiv Chowk)లో ఆయన 33వ ఏట 1996 ఫిబ్రవరి 26న ధర్నా(dharna) ప్రారంభించారు. షామ్లీ జిల్లాలోని తన స్వగ్రామం చౌసానాలో ప్రభుత్వ భూమిని భూకబ్జా మాఫియా ఆక్రమించుకోవడంతో ఆయన పోరాటం ప్రారంభించారు. చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వదిలేసి మరీ ధర్నాకు దిగారు. ఆయన పోరాటం ఫలితంగా ఎన్నో ప్రభుత్వ భూములకు కబ్జాదారుల చెరవీడింది.
భూకబ్జాలు, లంచగొండితనంపై దేశంలో ఈ తరహాలో ఇలా ఏళ్ల తరబడి ధర్నా చేయడం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ వెయ్యి బిగాల భూమి ల్యాండ్ మాఫియా కబ్జాలో ఉందని విజయ్ సింగ్ వాపోతున్నారు. 2012లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కమిటీని ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదని విజయ్ సింగ్ చెప్పారు.
2017లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నిష్పాక్షిక దర్యాప్తు చేయిస్తామని మాటిచ్చారని విజయ్ సింగ్ గుర్తు చేశారు. లక్నో చుట్టూ అనేకసార్లు చక్కర్లు కొట్టినా ఫలితం తేల్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ధర్నా తప్ప మరో మార్గం లేదని విజయ్ సింగ్ చెబుతున్నారు. భూకబ్జాలు, లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడటానికి తన జీవితాన్నే త్యాగం చేసిన విజయ్సింగ్ కల నెరవేరాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.