Mamata Banerjee: వాళ్లు చాలా ప్రమాదం..ఓటేయకండి..!

ABN , First Publish Date - 2023-05-08T18:30:54+05:30 IST

కోల్‌కతా: కర్ణాటక ప్రజలు సుస్ధిరత, అభివృద్ధికి ఓటు వేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. కర్ణాటక ప్రజలకు ఇదే తన విజ్ఞప్తి అని, బీజేపీకి ఓటు వేయవద్దని, వాళ్లు ప్రమాదకారులని అన్నారు.

Mamata Banerjee: వాళ్లు చాలా ప్రమాదం..ఓటేయకండి..!

కోల్‌కతా: కర్ణాటక ప్రజలు సుస్ధిరత, అభివృద్ధికి ఓటు వేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోరారు. కర్ణాటక ప్రజలకు ఇదే తన విజ్ఞప్తి అని, బీజేపీకి ఓటు వేయవద్దని, వాళ్లు ప్రమాదకారులని అన్నారు. హౌరాలోని నబన్నాలో సోమవారంనాడు మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ, హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో ఎంతమంతి ప్రాణాలు కోల్పోయారనే దానిపై బీజేపీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. మణిపూర్ హింసాకాండ మనుషులు సృష్టించినదని ఆరోపించారు. మణిపూర్‌ మరణాలపై తాము ఆందోళన చెందుతున్నామని, అసలు ఏమి జరిగింది? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు.

బెంగాల్‌లో 'కేరళ స్టోరీ'పై నిషేధం

వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'ని నిషేధించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వ నిర్ణయించినట్టు మమతా బెనర్జీ చెప్పారు. హింస, విద్వేషాల ఘటనలు చోటుచేసుకోకుండా, రాష్ట్రంలో ప్రశాంతతను కాపాడేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ''కశ్మీర్ ఫైల్స్ ఏమిటి? అది ఒక వర్గాన్ని చిన్నబుచ్చింది. కేరళ స్టోరీ ఏమిటి? వాస్తవాల వక్రీకరణ. బెంగాల్‌ ఫైల్స్‌తో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వాళ్లు యోచిస్తున్నారు'' అని సీఎం ఆరోపించారు. సీపీఎంపైనా ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీతో కలిసి సీపీఎం పనిచేస్తోందని, మొదట వాళ్లను విమర్శించాలని అన్నారు. బీజేపీతో కలిసి పనిచేయడం దురదృష్టకరమనే విషయాన్ని తాను కేరళ ప్రభుత్వానికి చెప్పదలచుకున్నానని తెలిపారు.

Updated Date - 2023-05-08T18:30:54+05:30 IST