Hindenburg Row : హిండెన్‌బర్గ్-అదానీ వివాదంలో కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2023-02-17T16:45:15+05:30 IST

అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను

Hindenburg Row : హిండెన్‌బర్గ్-అదానీ వివాదంలో కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తామే స్వయంగా నిపుణులను ఎంపిక చేస్తామని, యావత్తు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ధర్మాసనం తెలిపింది.

నిపుణుల పేర్లను తాము ప్రభుత్వం నుంచి స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కమిటీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని పేర్కొంది. హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని నియమించబోమని స్పష్టం చేసింది. అయితే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించింది.

సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10న నిర్వహించిన విచారణ సందర్భంగా, అదానీ గ్రూప్ (Adani Group) స్టాక్ పతనం నేపథ్యంలో మార్కెట్ ఒడుదొడుకుల నుంచి భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడవలసిన అవసరం ఉందని తెలిపింది. దేశంలోని నియంత్రణ వ్యవస్థలను పటిష్టపరచడానికి తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ డొమైన్ ఎక్స్‌పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేయడంపై పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.

అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్‌, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తానే స్వయంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అయితే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు వినిపించిన వాదనలలో, మన దేశంలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వంటి చట్టబద్ధ వ్యవస్థలకు సంపూర్ణ సమర్థత ఉందని, ఇవి తమ పని తాము చేస్తున్నాయని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలోని నియంత్రణ వ్యవస్థలకు ఓ పర్యవేక్షక కమిటీ ఉండాలనే ఉద్దేశపూర్వకం కానటువంటి సందేశం పెట్టుబడిదారులకు వెళ్లడం వల్ల విదేశీ నిధుల రాకపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీకి సంబంధించిన అన్ని వివరాలను, అంటే, నిపుణుల పేర్లు, కమిటీ పరిధి వంటి వివరాలన్నిటినీ సీల్డ్ కవర్లో అందజేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

సెబీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో, షార్ట్ సెల్లింగ్‌ను లేదా బారోవ్డ్ షేర్స్ అమ్మకాన్ని నిషేధించడానికి తాము అనుకూలం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్‌పై ఓ చిన్న షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలపైనా, దాని షేర్ల ధరల కదలికలపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

హిండెన్‌బర్గ్ నివేదిక జనవరి 24న విడుదలైంది. ఆ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఈ కంపెనీలు ఇప్పటి వరకు 120 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.

ఇవి కూడా చదవండి :

Tamil Nadu : సైనికుడి హత్య కేసులో డీఎంకే కౌన్సిలర్ అరెస్ట్

Adani Row: మోదీని టార్గెట్ చేస్తున్న విదేశీ శక్తులు, బిలియనీర్ జార్జి సోరోస్‌పై స్మృతి ఫైర్

Updated Date - 2023-02-17T16:45:19+05:30 IST