Supreme Court: సెలబ్రిటీలు సంయమనంతో మెలగాలి

ABN , First Publish Date - 2023-02-11T10:48:44+05:30 IST

ఎంతో మంది అభిమానులు కలిగిన నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) సంయమనంతో మెలగాలని సుప్రీంకోర్టు(Supreme Court) హితవు పలికింది.

Supreme Court: సెలబ్రిటీలు సంయమనంతో మెలగాలి

- విజయ్‌ సేతుపతికి సుప్రీంకోర్టు హితవు

అడయార్‌(చెన్నై), ఫిబ్రవరి 10: ఎంతో మంది అభిమానులు కలిగిన నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) సంయమనంతో మెలగాలని సుప్రీంకోర్టు(Supreme Court) హితవు పలికింది. పైగా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలని సూచించింది. 2021లో తనపై విజయ్‌ సేతుపతి బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దాడికి పాల్పడ్డారని, పరుష పదజాలంతో దూషించారని, అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహా గాంధీ అనే వ్యక్తి సైదాపేట మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేసు విచారణకు విజయ్‌ సేతుపతి స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో పాటు కేసును కూడా కొట్టివేయాలని కోరుతూ విజయ్‌ సేతుపతి తరపున న్యాయవాదులు హైకోర్టు ఆశ్రయించారు. విచారించిన కోర్టు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించి మూడు నెలల గడువు విధించింది. దీనిపై విజయ్‌ సేతుపతి తరపున సుప్రీంకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం మరోమారు న్యాయమూర్తి దినేష్‌ మహేశ్వరి సారధ్యంలోని ధర్మాసనంకు విచారణకు వచ్చింది. ‘ప్రేక్షకులకు వినోదం అందించే నటుడు చేసే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఎంతో మంది అభిమానులను కలిగిన నటుడు సంయమనంతో మెలగాలి. బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదని ధర్మాసనం అభిప్రాయపడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విజయ్‌సేతుపతిని సూచిస్తూ తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున ఇరు వర్గాలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

Updated Date - 2023-02-11T10:51:29+05:30 IST