Share News

Sharad Pawar: ప్రధాని తన పరిధిని గుర్తెరిగి మాట్లాడాలి.. మోదీకి పవార్ కౌంటర్

ABN , First Publish Date - 2023-10-28T17:29:27+05:30 IST

కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలదీయడాన్ని పవార్ శనివారంనాడు తప్పుపట్టారు. మోదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ పరిధిని గుర్తుంచుకుని కామెంట్లు చేయాల్సి ఉంటుందని హితవు పలికారు.

 Sharad Pawar: ప్రధాని తన పరిధిని గుర్తెరిగి మాట్లాడాలి.. మోదీకి పవార్ కౌంటర్

ముంబై: కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) సుప్రీం శరద్ పవార్ (Sharad Pawar) ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నిలదీయడాన్ని పవార్ శనివారంనాడు తప్పుపట్టారు. మోదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు (PM) తమ పరిధిని గుర్తుంచుకుని కామెంట్లు చేయాల్సి ఉంటుందని హితవు పలికారు. ప్రధానమంత్రి పదవి చాలా కీలకమైన పదవని, ఆ పదవిలో ఉన్న వారు తమ హోదాను గుర్తెరిగి స్టేట్‌మెంట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.


''ఆయన (ప్రధాని) నన్నెందుకు టార్గెట్ చేసి మాట్లాడారో నాకు తెలియదు. సరైన సమాచారం లేకుండానే ఆయన మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఆయన నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఆ పదవికి ఉన్న హోదాను, ప్రాధాన్యతను నేను గౌరవిస్తాను'' అని ముంబైలో మీడియాతో మాట్లాడుతూ పవార్ అన్నారు. అధికారం కోల్పోతామనే భయం కారణంగానే ప్రధాని ఇలాంటి కామెంట్లు చేసి ఉంటారని తాను అనుకుంటున్నానని చెప్పారు.


రైతు ప్రతినిధులమని చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు..

షిర్డీలో సాయిబాబా దర్శనం కోసం శుక్రవారంనాడు వచ్చిన ప్రధాన మంత్రి మోదీ.. యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న శరద్ పవార్‌పై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సాధికారత కోసం చురుగ్గా పనిచేస్తోందని, కానీ మహారాష్ట్రలోని కొందరు రైతు ప్రతినిధుల ముసుగులో రాజకీయాలకు పాల్పడుతున్నారని పరోక్షంగా పవార్‌ను విమర్శించారు. యూపీఏ హయాంలో రైతుల కోసం అప్పటి వ్యవసాయ మంత్రి ఏం చేశారని నిలదీశారు.


మోదీకి భయం పట్టుకుంది..

మోదీ వ్యాఖ్యలపై పవార్ సూటిగా స్పందిస్తూ...షిర్డీ సాయిబాబా దర్శనం కోసం వచ్చిన మోదీ ఆ పని చూసుకుని ఉంటే సరిపోయేదని అన్నారు. దేశ ముఖచిత్రం ఒకసారి చూస్తే, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు కానీ, ఇతర పార్టీలకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు కానీ చాలానే కనిపిస్తాయని, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట కూడా బలహీనంగానే ఉన్నాయని అన్నారు. అధికారాన్ని కోల్పోతామన్న భయం కారణంగానే ఆయన (ప్రధాని) ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పవార్ విమర్శించారు.


కాంగ్రెస్ హయాంలో..

కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు సంక్షుభిత పరిస్థితులను తాను చవిచూడాల్సి వచ్చిందని పవార్ చెప్పారు. వ్యవసాయ మంత్రిగా 2004 నుంచి 2014 వరకూ తాను ఉన్నానని, మొదటి రోజు నుంచి కూడా తాను సంక్షోభ పరిస్థితులే చూశానని అన్నారు. అయితే దానిని అధిగమించామని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే డాక్యుమెంట్‌పై తాను సంతకం చేశానని, అదే జరగకపోయి ఉంటే పీడీఎస్ పంపిణీ నిలిచిపోయేదని చెప్పారు. ఇదే సమయంలో వివిధ పంటలకు కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయం తీసుకున్నానని, పలు పంటల ఎంఎస్‌పీ అనేక రెట్లు పెంచడం జరిగిందని తెలిపారు.


ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీకి వ్యతిరేక పవనాలు..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి అడిగిన ఒక ప్రశ్నకు పవార్ సూటిగా సమాధానమిస్తూ, పరిస్థితి బీజేపీకి అనుకూలంగా లేదని అన్నారు. ప్రతిచోట ప్రభుత్వాలు మారుతాయని తాను చెప్పను కానీ, బీజేపీకి వ్యతిరేక పరిస్థితి ఐదు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికిప్పుడు తాను ఎలాంటి అంచనా వేయలేదన్నారు.


ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై కేంద్రం గందరగోళం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అడిగిన ప్రశ్నకు పవార్ స్పందిస్తూ, కేంద్రం పూర్తి గందరగోళంతో ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ అంశం విషయంలో ఎలాంటి గందరగోళం తాను చూడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒక వైఖరి తీసుకుందని, కొద్దిరోజుల తర్వాత మన విదేశాంగ మంత్రి మరో వైఖరిని ముందుకు తెచ్చారని అన్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఎప్పుడూ భారత విదేశాంగ విధానం ఉండేదని, పాలస్తీనా, గాజా విషయంలో ఇండియా పాలసీలో ఇప్పుడు మార్పు రావడం గతంలో తాను చూడలేదన్నారు. మొత్తం మీద ఈ అంశంలో కేంద్రం చాలా గందరగోళంగా ఉందని అన్నారు.

Updated Date - 2023-10-28T17:29:27+05:30 IST