Rajasthan: సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం, రాత్రివేళల్లో జనసంచారంపై నిషేధం

ABN , First Publish Date - 2023-08-19T16:17:21+05:30 IST

అక్రమ చొరబాటులకు కళ్లెం వేసేందుకు రాజస్థాన్‌ లోని జైసల్మేర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి ప్రయాణాలపై నిషేధం విధించారు.

Rajasthan: సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం, రాత్రివేళల్లో జనసంచారంపై నిషేధం

జైపూర్: అక్రమ చొరబాటులకు (infiltration) కళ్లెం వేసేందుకు రాజస్థాన్‌ (Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer) జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి ప్రయాణాల (Night Travels)పై నిషేధం (Ban) విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ గుప్తా శనివారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలంటూ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు 2023 డిసెంబర్ 12 వరకూ అమలులో ఉంటాయి.


రాత్రివేళల్లో నిషేధం విధించిన సమయాల్లో ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన బీఎస్ఎఫ్ పోస్ట్ వద్ద తగిన అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. జైసల్మేర్, పోకరాన్ తహసిల్ పరిధిలోని 52 గ్రామాల్లో ఈ నిషేధం విధించారు.


జైసల్మేర్‌కు అనుకుని ఉన్న ఇండో-పాక్ సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాల అక్రమరవాణా నిరంతరాయంగా సాగుతుండటం, ఇదే సమయంలో చొరబాటు కేసులు కూడా పెరుగుతుండటంతో జిల్లా యాంత్రాంగం ఈ చర్యలు తీసుకుంది. దీనితో పాటు, సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సిమ్‌ల వినియోగంపై కూడా నిషేధం విధించింది.

Updated Date - 2023-08-19T16:17:21+05:30 IST