Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..

ABN , First Publish Date - 2023-03-25T13:36:51+05:30 IST

దానీ షెల్‌ కంపెనీలపై మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన..

Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..

Delhi : అదానీ షెల్‌ కంపెనీలపై ప్రధాని మోదీ (PM Modi) సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ‘‘అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలి. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన షెల్ కంపెనీలు డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్నాయి. ఒక చైనా జాతీయుడికి కూడా ఈ పెట్టుబడులతో లింక్ ఉంది. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని అడిగాను. ప్రజల్లోనే ఉంటాను.. భారత్‌ జోడో యాత్రలో ప్రజల్లోకి వెళ్లాను. నేను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తివే అయితే నాకు మాట్లాడే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నావు? భారత ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకు నేనిక్కడ ఉన్నాను. నేను దేనికీ భయపడను.

రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోదీ-అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారు. అనర్హత అంశాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. అనర్హతలు లాంటివి నన్ను ఏమి చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. మోదీకి ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఓబీసీ వ్యవహారం కాదు... మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలి. ఈ దేశం నాకు ప్రేమ, ఆప్యాయత సహా అన్ని ఇచ్చింది.

కేసు, శిక్ష, తదుపరి కార్యాచరణ గురించి ప్రశ్నిస్తే.. నేను దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. అందుకే న్యాయపరమైన అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. నా తదుపరి ప్రసంగం గురించి ప్రధాని భయపడ్డారు. పార్లమెంటులో నేను మాట్లాడబోయే అంశాల గురించి మోదీ భయపడ్డారు. నాపై అనర్హత వేటు వేయడానికి అదే కారణం. నాకు సంఘీభావం, మద్ధతు ప్రకటించిన విపక్షాలకు కృతజ్ఞతలు. అందరం కలసికట్టుగా పనిచేద్దాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా నా పని నేను చేసుకుంటా. నేను పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా నా పని నేను చేస్తాను. నన్ను జైల్లో పెట్టినా సరే నా పని నేను చేస్తాను. ప్రధాని ప్రతిపక్షాలకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోదీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశం అని ప్రధాని చెబుతున్నారా?’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Updated Date - 2023-03-25T13:36:51+05:30 IST