Mann Ki Baat : నవ భారత నిర్మాణానికి ‘ప్రజల పద్మా’ల ఉద్యమం : మోదీ

ABN , First Publish Date - 2023-01-29T13:00:27+05:30 IST

‘ప్రజల పద్మా’ల ఉద్యమం ప్రజల భాగస్వామ్యంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ఈ ఉద్యమం నవ భారత నిర్మాణానికి

Mann Ki Baat : నవ భారత నిర్మాణానికి ‘ప్రజల పద్మా’ల ఉద్యమం : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : ‘ప్రజల పద్మా’ల ఉద్యమం ప్రజల భాగస్వామ్యంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ఈ ఉద్యమం నవ భారత నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారాలను పొందినవారిలో గిరిజన జాతులు, వారితో మమేకమైనవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారన్నారు. 2023లో మొట్టమొదటి మన్ కీ బాత్ (Mann ki Baat) రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు.

గిరిజన జీవితం నగర జీవితం కన్నా భిన్నమైనదని చెప్పారు. గిరిజన జీవన విధానంలో కూడా తనదైన సవాళ్లు ఉన్నాయన్నారు. అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ గిరిజన సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ఆత్రుతతో కృషి చేస్తున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు చెందిన పెయింటర్స్, మ్యుజీషియన్స్, రైతులు, కళాకారులు వంటివారు ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారాలను పొందారన్నారు. వీరి కథలు ప్రేరణనిస్తాయని, వాటిని చదవాలని ప్రజలను కోరారు. టోటో, హో, కుయి, కువి, మాండా వంటి గిరిజన భాషలపై కృషి చేసిన అనేకమందికి పద్మ పురస్కారాలు లభించాయన్నారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. సిద్ధి, జర్వా, ఒంగే తెగల ప్రజలతో కలిసి కృషి చేస్తున్నవారు కూడా ఈ పురస్కారాలను పొందినట్లు తెలిపారు.

‘ఇండియా - ది మదర్ ఆఫ్ డెమొక్రసీ’ పుస్తకాన్ని అందరూ చదవాలని మోదీ సూచించారు.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, ఘనత సాధించినప్పటికీ, ప్రచారానికి నోచుకొనని అనేక మందిని ఇటీవల పద్మ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ను ఉపయోగించడంపై విశేషంగా కృషి చేసిన దిలీప్ మహలనబీస్‌కు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. రతన్ చంద్ర కర్, హీరాబాయ్ లోబీ, మునీశ్వర్ చంద్ర దావర్ తదితర 25 మంది అన్‌సంగ్ హీరోస్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది.

Updated Date - 2023-01-29T13:00:30+05:30 IST