Share News

Ashok Gehlot: పీఎం రోడ్‌షో ప్లాప్..బయట నుంచి జనాన్ని తీసుకొచ్చారు..!

ABN , First Publish Date - 2023-11-22T15:21:45+05:30 IST

ప్రధాన నరేంద్ర మోదీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారంనాడు విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ చాలా నెర్వస్‌తో ఉన్నారని, ఇటీవల ఆయన రాష్ట్రంలో జరిపిన రోడ్‌షో పెద్ద ఫ్లాప్ అని అన్నారు.

Ashok Gehlot: పీఎం రోడ్‌షో ప్లాప్..బయట నుంచి జనాన్ని తీసుకొచ్చారు..!

జైపూర్: ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi)పై రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) బుధవారంనాడు విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ చాలా నెర్వస్‌తో ఉన్నారని, ఇటీవల ఆయన రాష్ట్రంలో జరిపిన రోడ్‌షో (Roadshow) పెద్ద ఫ్లాప్ అని అన్నారు.


''పీఎం రోడ్‌షో ఫ్లాప్ అయింది. కేవలం 9 కిలోమీటర్లు రోడ్‌షో జరిగింది. వాళ్లు చాలా నెర్వస్‌గా ఉన్నారు. బయట నుంచి జనాన్ని రప్పించారు. ఏనాడూ వాళ్లు స్థానిక అంశాలను ప్రస్తావించ లేదు'' అని గెహ్లాట్ విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేందుకు ఈడీ, సీబీఐ వంచి ఏజెన్సీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తప్పుపట్టారు. ఈడీ, ఐటీలు కీలకమైనవని, ఆర్థిక నేరగాళ్ల పనిపట్టడమే ఈ ఏజెన్సీల పని అని, ఆ దిశగా ఏజెన్సీలను పురమాయిస్తే దేశ ఆర్థిక స్థితి పటిష్టం కావడంతో పాటు ఆర్థిక నేరాలకు కళ్లెం పడుతుందని సూచించారు. అయితే బీజేపీ తొమ్మిదేళ్లుగా ప్రభుత్వాలను కూల్చడం, ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేయడం పనిగా పెట్టుకుందన్నారు. ఈడీ ఒత్తిళ్లు, ఐటీ దాడులతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఈ వ్యవహారాలను ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడటం లేదని చెప్పారు.


రాజకీయ భవిష్యత్తుపై..

తన రాజకీయ భవితవ్యం కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా గెహ్లాట్ చెప్పారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. దీనికి ముందు ఓటర్లకు గెహ్లాట్ భావోద్వేగంతో కూడిన అప్పీల్ చేశారు. ఈ ఎన్నికల్లో 200 సీట్లలో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అభ్యర్థులు ఎవరైనప్పటికీ తానే పోటీచేస్తున్నట్టుగా ఓటర్లు భావించి గెలిపించాలని కోరారు. 150 చోట్ల ప్రచారానికి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ అన్ని చోట్లకు వెళ్లలేకపోయాయని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-22T15:21:46+05:30 IST