Metro Rail: కేఆర్‌పుర - వైట్‌ఫీల్డ్‌ మధ్య మెట్రో సేవలు

ABN , First Publish Date - 2023-03-18T10:37:31+05:30 IST

శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్ర పర్యటనకు

Metro Rail: కేఆర్‌పుర - వైట్‌ఫీల్డ్‌ మధ్య మెట్రో సేవలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మరిన్ని చారిత్రాత్మక పథకాలను లాంఛనంగా జాతికి అంకితం చేయనున్నారు. రెండు నెలలుగా ప్రధాని రాష్ట్ర పర్యటనలో రెండు ప్రాంతాల్లో మాత్రమే కార్యక్రమాలను నిర్వహించారు. తొలిసారిగా మూడు ప్రాంతాల్లో భిన్నమైన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈనెల 25న శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి దావణగెరెలో పార్టీ నాలుగు ప్రాంతాల వారీగా సాగిస్తున్న విజయ సంకల్పయాత్ర ముగింపులో భాగస్వామ్యులవుతారు. అనంతరం చిక్కబళ్లాపుర తాలూకా ముద్దేనహళ్లికి అనుబంధమైన సత్యసాయి గ్రామంలో శ్రీ మధుసూధన సాయి మెడికల్‌ కళాశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం కేఆర్‌ పుర - వైట్‌ఫీల్డ్‌(KR Pura - Whitefield) మధ్య మెట్రో మార్గాన్ని జాతికి అంకితం చేస్తారు. ఇదే సందర్భంగా మెట్రోలో ప్రయాణిస్తారు. కాగా విధానసౌధ ఎదుట నిర్మిస్తున్న కెంపేగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని 27 లేదా 29వ తేదీల్లో బెంగళూరుకు రావచ్చునని ప్రచారం సాగుతోంది. విధానసౌధ ఎదుట జగజ్యోతి బసవన్న, నాడప్రభు కెంపేగౌడ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే రెండు విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో బలమైన రెండు సామాజిక వర్గాలకు బీజేపీ అండగా ఉందనే సంకేతాలు పంపదలచారు. కాగా దావణగెరెలో నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్ర ముగింపునకు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

Updated Date - 2023-03-18T10:37:31+05:30 IST