Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు కేసులు పెరిగాయా..? తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే..?

ABN , First Publish Date - 2023-09-04T21:06:03+05:30 IST

మన భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా.. కరోనా వైరస్ మన దేశంపై దాడి చేసినప్పటి నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి....

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు కేసులు పెరిగాయా..? తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే..?

మన భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా.. కరోనా వైరస్ మన దేశంపై దాడి చేసినప్పటి నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లు మాత్రమే ఈ గుండెజబ్బు బారిన పడగా.. కరోనా వైరస్ విజృంభణ తర్వాత యుక్త వయసులో ఉన్న వారు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. యువకులకు కూడా గుండెపోటు రావడానికి కారణం.. ఈ కరోనా వ్యాక్సినేనని జనాలు బలంగా నమ్మడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు జరిపించింది. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు ముప్పు పెరిగిందా? లేదా? అనే విషయాన్ని తేల్చాలని ఆ కేంద్రాల్ని సూచించింది. కేంద్రం సూచనల మేరకు దీనిపై పరిశోధనలు చేయగా.. ఒక స్టడీ ఆ రెండింటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని ఐసీఎంఆర్ అనే అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటు కేసులు పెరగడం లేదని.. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురించబడింది.


ఈ అధ్యయనానికి అధ్యక్షత వహించిన జీబీ పంత్‌ ఆస్పత్రికి చెందిన మోహిత్‌ గుప్తా మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌లు సురక్షితమని వెల్లడైందని అన్నారు. గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదని.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని గుర్తించామని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (AMI) ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందని తెలిపారు.

రోగుల ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించిందని ఈ పరిశోధన అధికారులు తెలిపారు. రోగం తీవ్రంగా ఉన్నవారిలో కోవిడ్ వ్యాక్సిన్‌ని అందించడం వల్ల.. కరోనా వైరస్ బారి నుంచి వాళ్లు బయటపడ్డారన్నారు. ఫలితంగా.. మరణాల రేటును తగ్గిందచన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏ రోగికి కూడా గుండెపోటు రాలేదని.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 30 రోజుల్లో 2 శాతం మంది రోగులు మాత్రమే మరణించారని అన్నారు. ఆ మరణాలు కూడా వ్యాక్సిన్ వల్ల సంభవించలేదన్నారు. వైరస్ సోకిన రోగులలో మరణాల రేటును తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్ చాలా సహాయపడిందని వాళ్లు చెప్పుకొచ్చారు.

కాగా.. ఈ అధ్యయనం ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో జరిగింది. ఆగస్టు 2021-ఆగస్టు 22 మధ్య కాలంలో ఆ ఆసుపత్రిలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు.

Updated Date - 2023-09-04T21:06:03+05:30 IST