King Charles III’s coronation : బ్రిటన్ మహారాజుగా పట్టాభిషిక్తుడైన కింగ్ చార్లెస్-3

ABN , First Publish Date - 2023-05-06T17:00:53+05:30 IST

బ్రిటన్ మహారాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్య యుగంనాటి పరిస్థితులను గుర్తు చేయడంతోపాటు 21వ

King Charles III’s coronation : బ్రిటన్ మహారాజుగా పట్టాభిషిక్తుడైన కింగ్ చార్లెస్-3
King Charles-III Coronation

లండన్ : బ్రిటన్ మహారాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్య యుగంనాటి పరిస్థితులను గుర్తు చేయడంతోపాటు 21వ శతాబ్దపు ఆధునికతను కూడా జోడిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో కింగ్ చార్లెస్-3కు కిరీట ధారణ జరిగింది. సెయింట్ ఎడ్వర్ట్స్ కిరీటాన్ని కింగ్ చార్లెస్-3కి కాంటర్‌బరీ అండ్ యోర్క్ ఆర్చ్‌బిషప్ ధరింపజేశారు. ఈ కిరీటాన్ని ఆయన తన జీవితంలో ఇప్పుడు మాత్రమే ధరిస్తారు. ప్రిన్స్ విలియం అధికారికంగా తన తండ్రికి తన విధేయతను ప్రకటించారు.

అంతకుముందు, చార్లెస్‌కు కత్తిని కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ అందజేశారు. ఈ కత్తిని న్యాయం చేయడానికి, అధర్మం వృద్ధిని ఆపడానికి, హోలీ చర్చ్ ఆఫ్ గాడ్‌ను పరిరక్షించడానికి, సద్భావనగల ప్రజలను కాపాడటానికి ఉపయోగించాలని చెప్పారు. యూదుల ప్రతినిధి బారోనెస్ మెర్రోన్ రోబ్ రాయల్‌ను బహూకరించారు. ఆయనకు స్టోల్ రాయల్‌ అనే వస్త్రాన్ని ప్రిన్స్ విలియం అందజేశారు. కింగ్‌ ఛార్లెస్-3కి కరిట ధారణ జరిగిన తర్వాత క్వీన్ కేమిలాకు కూడా కిరీట ధారణ జరిగింది.

దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితంనాటి క్రిస్టియన్ సర్వీసెస్ ఈ కార్యక్రమంలో నిర్వహించారు. అయితే కింగ్ చార్లెస్ డిమాండ్ మేరకు సాదాసీదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల రాజవంశీకులు, వివిధ దేశాల అధినేతలు, కింగ్ చార్లెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏమిటంటే..

కింగ్ చార్లెస్-3 (King Charles-3) తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-2) మరణానంతరం గత ఏడాది సెప్టెంబరు 8న బ్రిటన్ రాజ్యాధినేత అయ్యారు. రెండు రోజుల తర్వాత జరిగిన యాక్సెషన్ సెర్మనీలో ఆయనను అధికారికంగా మోనార్క్‌గా ప్రకటించారు. అప్పట్లో ఆయన మాట్లాడుతూ, ఈ విశిష్ట వారసత్వం గురించి తనకు చాలా లోతుగా తెలుసునని, తనకు అందజేసిన సార్వభౌమాధికారపు కర్తవ్యాలు, గొప్ప బాధ్యతల గురించి తనకు బాగా తెలుసునని చెప్పారు.

మే 6న జరిగిన పట్టాభిషేకం కార్యక్రమం ఆయన రాజ్యాధినేత అని, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు అధినేత అని అధికారికంగా ధ్రువీకరిస్తుంది. ఈ సందర్భంగా కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ కింగ్ చార్లెస్‌కు నూనెతో మర్దన చేశారు. రాజ వంశానికి సంబంధించిన సంప్రదాయ చిహ్నాలను కింగ్ స్వీకరించారు. విలియం ది కాంకరర్ 1066లో పట్టాభిషిక్తుడైనది వెస్ట్‌మినిస్టర్ అబ్బేలోనే. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

క్వీన్ ఎలిజబెత్ -2 పట్టాభిషేకం 1953 జూన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సుమారు 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహిస్తుండటంతో సుమారు 2,800 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారని అంచనా.

పట్టాభిషేకం కార్యక్రమంలో హిందూ, బౌద్ధ, యూదు, ముస్లిం, సిక్కు మతాల పెద్దలు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి 125 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.

బ్రిటన్‌ ప్రజలు జీవన వ్యయం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ పట్టాభిషేకం జరిగింది. 1937 తర్వాత బ్రిటన్‌కు రాజు పట్టాభిషిక్తుడు కావడం ఇదే మొదటిసారి.

కింగ్ చార్లెస్-3 , ఆయన సతీమణి కేమిలా ఆరు విడ్సర్ గ్రే గుర్రాలు నడుపుతున్న డయమండ్ జూబిలీ స్టేట్ కోచ్‌లో అబ్బేకు వెళ్లారు. చార్లెస్ మనుమడు ప్రిన్స్ జార్జి, కేమిలా మనుమలు అధికారిక హోదాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పటికీ, బైబిల్ నుంచి వాక్యాలను చదివి చరిత్ర సృష్టించారు. బ్రిటన్ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల సగర్వ వ్యక్తీకరణగా ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని రుషి అభివర్ణించారు.

కింగ్ చార్లెస్, క్వీన్ కెమెలా ఈ కార్యక్రమం అనంతరం తిరిగి బకింగ్‌హాం ప్యాలెస్‌కు వెళ్తారు. వీరితోపాటు ఇతర రాజవంశీకులు బాల్కనీలో సంప్రదాయబద్ధంగా ప్రజలకు కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి :

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంను రప్పించే ప్రయత్నాలు సాగేది ఇంకెంత కాలం?

Bajrang Dal Ban : హిందూ సంస్థలపై నిషేధాలు.. భావోద్వేగ రాజకీయాలు..

Updated Date - 2023-05-06T17:02:55+05:30 IST