Kerala : భారత్‌లో పుట్టినవారంతా హిందువులే : కేరళ గవర్నర్

ABN , First Publish Date - 2023-01-29T11:59:55+05:30 IST

భారత దేశంలో పుట్టి, ఇక్కడ పండిన ఆహారాన్ని తిని, జీవించేవారంతా హిందువులేనని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నారని

Kerala : భారత్‌లో పుట్టినవారంతా హిందువులే : కేరళ గవర్నర్
Kerala Governor Arif Mohammed Khan

తిరువనంతపురం : భారత దేశంలో పుట్టి, ఇక్కడ పండిన ఆహారాన్ని తిని, జీవించేవారంతా హిందువులేనని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నారని కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ (Arif Mohammed Khan) చెప్పారు. స్వాతంత్ర్యానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మతాలను ఆమోదించారని తెలిపారు. ఉత్తర అమెరికాలోని కేరళ హిందువులు తిరువనంతపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో అరిఫ్ మాట్లాడారు.

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, సంస్కరణవాది, విద్యావేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గతంలో ఆర్య సమాజ్ సమావేశంలో మాట్లాడారని గవర్నర్ అరిఫ్ గుర్తు చేశారు. భారత దేశంలో పుట్టినవారెవరైనా, భారత దేశంలో పండిన ఆహారంపై జీవించేవారెవరైనా, భారత దేశంలోని నదుల నీటిని తాగేవారెవరైనా తనను తాను హిందువుగా చెప్పుకోవడానికి అర్హడవుతారని సర్ సయ్యద్ చెప్పారని తెలిపారు. తనను హిందువుగా పరిగణించాలని సర్ సయ్యద్ కోరినట్లు తెలిపారు. ‘‘మీరు నన్ను ఓ హిందువు అని తప్పనిసరిగా పిలవాలి’’ అని కోరారన్నారు.

‘‘మీ (ఆర్య సమాజ్ సభ్యులు) మీద నాకు ఉన్న తీవ్రమైన ఫిర్యాదు ఏమిటంటే, నన్ను ఓ హిందువుగా ఎందుకు పరిగణించరు? హిందువు అనేది మతపరమైన పదం అని నేను భావించను. హిందూ అనేది భౌగోళిక పదం’’ అని సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పారని గవర్నర్ అరిఫ్ తెలిపారు.

వలస పాలన కాలంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా సర్ సయ్యద్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆర్య సమాజ్ సభ్యులు ఆయనకు విందు ఇచ్చారని గవర్నర్ తెలిపారు.

బ్రిటిషర్లు ప్రజల సాధారణ హక్కులను నిర్ణయించేందుకు ప్రాతిపదికగా మతాలను వాడుకున్నారని గవర్నర్ తెలిపారు. అటువంటి సమయంలో హిందూ, ముస్లిం, సిక్కు వంటి పదాలను వాడటం కచ్చితంగా బాగుంటుందని చెప్పారు.

‘‘నేను హిందువును’’ అని చెప్పుకోవడం తప్పు అనే భావన కలిగించే కుట్ర కేరళలో జరుగుతోందన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మతాలను విశాల దృక్పథంతో ఆమోదించారని తెలిపారు.

Updated Date - 2023-01-29T12:00:00+05:30 IST