JDU Leader : ప్రతి పట్టణాన్నీ ‘కర్బల’గా మార్చుతాం : జేడీయూ నేత గులాం రసూల్
ABN , First Publish Date - 2023-01-20T20:10:16+05:30 IST
జనతా దళ్ యునైటెడ్ (JDU) ఎమ్మెల్సీ గులాం రసూల్ బల్యావీ (Gulam Rasool Balyawi) అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాట్నా : జనతా దళ్ యునైటెడ్ (JDU) ఎమ్మెల్సీ గులాం రసూల్ బల్యావీ (Gulam Rasool Balyawi) అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి పట్టణాన్నీ కర్బలగా మార్చుతామని హెచ్చరించారు. ముస్లింల భద్రత కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినప్పటికీ ఆయన వెనుకకు తగ్గలేదు. మానవత్వం, సోదరభావం కోసం అన్నిటినీ వదులుకునేందుకు తాను సిద్ధమని తెలిపారు. ఇరాక్లోని కర్బలలో మహమ్మద్ మనుమడు హుస్సేన్ సమాధి ఉంది.
బిహార్కు చెందిన గులాం రసూల్ బల్యావీ గురువారం జార్ఖండ్లోని హజారీబాగ్లో మాట్లాడుతూ, బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నూపుర్ శర్మను ప్రస్తావించారు. ‘‘మా పెద్దాయన గౌరవం విషయంలో వేలు పెట్టావో, మేం కర్బల మైదానంలో చేరి, ప్రతి పట్టణాన్ని కర్బలగా మార్చుతాం’’ అని చెప్పారు. సెక్యులర్ పార్టీలేవీ నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం మాదిరిగానే ముస్లింల భద్రత కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురావాలన్నారు. అధికారంలో తమకు భాగస్వామ్యం ఉండాలన్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలని, వరకట్నం అంతం కావాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలను ఆయన శుక్రవారం సమర్థించుకున్నారు. ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాను అన్ని పట్టణాలను కర్బలగా మార్చుతానని అన్నానని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. అన్నిటినీ వదులుకోవడం, త్యాగం చేయడమే కర్బల అన్నారు. మానవత్వం, సోదరభావం వదులుకోవలసిన అవసరం రానివ్వబోనన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా ముద్ర వేసి జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. నిరసన తెలియజేయడానికి వెళ్తే కాల్చుతున్నారని చెప్పారు. ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం ముస్లిం భద్రత చట్టాన్ని తీసుకురావాలన్నారు.