Union Budget 2023: దేశ తొలి బడ్జెట్ ఎంతో తెలుసా..? మొట్టమొదటి బడ్జెట్ విశేషాలివే..!

ABN , First Publish Date - 2023-02-01T10:46:16+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2023ను (Budget2023) మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Union Budget 2023: దేశ తొలి బడ్జెట్ ఎంతో తెలుసా..? మొట్టమొదటి బడ్జెట్ విశేషాలివే..!

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2023ను (Budget 2023) మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారత మొట్టమొదటి బడ్జెట్‌ విశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర్య్ం వచ్చిన తర్వాత దేశ తొలి బడ్జెట్‌ను (India's First Budget) కేంద్ర ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి (RK Shanmukham Chetty) 1947 నవంబర్ 26వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రకారం ఆదాయం రూ.171.15 కోట్లు, వ్యయం రూ.197.39 కోట్లు, లోటు రూ.26.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో రక్షణ రంగానికి అత్యధికంగా రూ. 92.74కోట్లు కేటాయించారు. ఇక ఆదాయ అంచనా రూ.171.15 కోట్లలో కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లు వస్తాయని అంచనా వేయడం జరిగింది. అలాగే పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖ నుంచి ఆదాయం రూ.15.9 కోట్లు, ఖర్చు, వడ్డీ రూ.13.9 కోట్లుగా పేర్కొన్నారు. నికర మిగులు అంచనా రూ.2 కోట్లుగా వేశారు. ఈ బడ్జెట్ 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు కేవలం ఏడున్నర నెలలు మాత్రమే అమలు అయింది.

తొలి బడ్జెట్ విశేషాలివే..

అప్పట్లో ఈ బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి కారణం బ్రిటన్‌లోని రాజకీయ నేతలు, సభ్యులు కూడా దీనిలో పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బ్రిటన్‌లో సమయం మధ్యాహ్నం అవుతుంది. ఇక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే లీక్ కావడం సంచలనం సృష్టించింది. బ్రిటన్ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ (ఆర్థిక మంత్రి హోదా) హూ డాల్టన్ భారత బడ్జెట్‌లోని కీలకమైన ట్యాక్స్ మార్పులను ఇలా ముందే బహిర్గతం చేశాడు. ఆయన ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పేశాడు. అంతే.. సదరు జర్నలిస్ట్ తర్వాతి రోజు బడ్జెట్ ప్రతిపాదనలతో ఓ కథనాన్ని ప్రచురించాడు. దాంతో హూ డాల్టన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ బడ్జెట్ గోప్యత అనేది చాలా కీలకం. అందుకే ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో ఆర్థిక శాఖలోని కీలక ఉద్యోగులు కొన్ని రోజుల పాటు తమ ఇండ్లకు కూడా వెళ్లకుండా కార్యాలయాలకే పరిమితం కావడం జరుగుతుంది.

Updated Date - 2023-02-01T10:56:20+05:30 IST