India vs Pakistan: ముందు ఈ మూడు పనులు చేయండి.. పాకిస్తాన్ కక్కిన ‘కశ్మీర్’ విషంపై భారత్ గట్టి కౌంటర్

ABN , First Publish Date - 2023-09-23T21:40:34+05:30 IST

దాయాది దేశమైన పాకిస్తాన్.. తన కింద నలుపు (ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు) చూసుకోకుండా గురువింద నీతులు చెప్తూ ఎప్పుడూ భారత్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై జమ్ముకశ్మీర్ అంశాన్ని...

India vs Pakistan: ముందు ఈ మూడు పనులు చేయండి.. పాకిస్తాన్ కక్కిన ‘కశ్మీర్’ విషంపై భారత్ గట్టి కౌంటర్

దాయాది దేశమైన పాకిస్తాన్.. తన కింద నలుపు (ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు) చూసుకోకుండా గురువింద నీతులు చెప్తూ ఎప్పుడూ భారత్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రతీసారి తీసుకొచ్చి.. భారత్‌పై విషం కక్కుతూనే ఉంటుంది. ఇందుకు మన దౌత్యవేత్తల నుంచి చాలాసార్లు గట్టి దెబ్బలు పడినా.. పాక్ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. తనపై ఉమ్మిన ఉమ్మును తుడుచుకొని.. సిగ్గు లేకుండా పదే పదే ఆ అంశాన్ని తెరమీదకు తెస్తుంది. తాజగా న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి 78వ సర్వ ప్రతినిధి సమావేశాల్లోనూ జమ్ముకశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భారత్.. పాక్ దిమ్మతిరిగేలా గట్టి కౌంటర్ ఇచ్చింది.


ఈ సమావేశాల్లో పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. భారత్‌తో పాక్ శాంతి కోరుకుంటోందని, ఈ శాంతి నెలకొనాలంటే కశ్మీర్ కీలకమని అన్నారు. ఈ అంశంపై భారత్ గట్టిగా స్పందిస్తూ.. ‘‘భారత్‌కు వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు, అసత్య ప్రచారాలకు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాకిస్తాన్ అలవాటుగా మారింది. మానవ హక్కుల విషయంలో తన దారుణమైన రికార్డ్‌ని అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు పాక్ ఇలా చేస్తోందని UN సభ్య దేశాలు, ఇతరులకు బాగా తెలుసు’’ అని యూఎస్ కార్యదర్శి పెటల్ గెహ్లాట్ అన్నారు. ‘‘జమ్ముకశ్మీర్‌లోని కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని మేము పునరుద్ఘాటిస్తున్నాము. ఆ ప్రాంతాలకు సంబంధించిన విషయాలు పూర్తిగా భారతదేశ అంతర్గతమైనవి. ఈ విషయాలపై మాట్లాడే హక్కు పాక్‌కు లేదు’’ అని ఆమె తిప్పికొట్టారు.

పెటల్ గెహ్లాట్ ఇంకా మాట్లాడుతూ.. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే, పాకిస్తాన్ మూడు పనులు చేయాల్సి ఉంటుందని అన్నారు. ‘‘ఒకటి.. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంతో పాటు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిలిపివేయాలి. రెండోది.. తన దురాక్రమణలో ఉన్న భారత భూభాగాలను ఖాళీ చేయండి. మూడోది.. పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టాలి’’ అని ఆమె అన్నారు. పాకిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన మహిళల పరిస్థితి.. ముఖ్యంగా హిందూ సిక్కులు, క్రైస్తవుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అంతేకాదు.. 2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారి కోసం పాక్ వితండవాదానికి దిగకుండా, వారిపై విశ్వసనీయమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-23T21:40:34+05:30 IST