Manipur: మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత.. బలగాలతో ఇంఫాల్‌లో ల్యాండైన ఎయిర్‌ఫోర్స్ విమానం

ABN , First Publish Date - 2023-05-04T18:42:36+05:30 IST

మణిపూర్‌‌లో(Manipur) హింస ప్రజ్వరిల్లడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు కేంద్ర బలగాలతో ఎయిర్‌‌ఫోర్స్ విమానం (Indian Air Force) రాజధాని ఇంఫాల్‌లో(Imphal) ల్యాండైంది.

Manipur: మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత.. బలగాలతో ఇంఫాల్‌లో ల్యాండైన ఎయిర్‌ఫోర్స్ విమానం
IAF aircraft carrying Central forces landed in Imphal

ఇంఫాల్‌: మణిపూర్‌‌లో(Manipur) హింస ప్రజ్వరిల్లడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు కేంద్ర బలగాలతో ఎయిర్‌‌ఫోర్స్ విమానం (Indian Air Force) రాజధాని ఇంఫాల్‌లో(Imphal) ల్యాండైంది.

మరోవైపు ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఇప్పటికే అనేక వాహనాలను తగులబెట్టారు. ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌ నగరాల్లో హింసాకాండ పెచ్చుమీరింది.

మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ATSUM) నాయకత్వం వహిస్తోంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దీంతో హింస ప్రజ్వరిల్లిందని తెలిపింది. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ, ఇంఫాల్‌, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ హింసాకాండలో చాలా మంది గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఉద్రిక్తతలను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ప్రశాంతంగా ఉండాలని కోరారు.

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ స్పందిస్తూ, సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే దీనికి కారణమని చెప్పారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమని అన్నారు. తాజా పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌తో చర్చించారు.

మణిపూర్ జనాభాలో మెయిటీలు 53 శాతం మంది ఉన్నారని, వారిని ఎస్టీల్లో చేర్చడం వల్ల తమకు ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తగ్గిపోతాయని మెయిటీలకు ఎస్‌టీ హోదాను ఇవ్వాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నవారు వాపోతున్నారు. మెయిటీలు ముఖ్యంగా ఇంఫాల్ లోయలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 40 శాతం మేరకు ఉంటారు. నాగాలు, కుకీలు కూడా గిరిజనులే.

ప్రముఖ క్రీడాకారిణి మేరీ కోమ్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహాయపడండి’’ అని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వివిధ మీడియా సంస్థలకు ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మణిపూర్ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు.

హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. శాంతిభద్రతలను కాపాడటం కోసం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

సైన్యం నిర్వహిస్తున్న, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాల్లో దాదాపు 4000 మంది గ్రామస్థులను ఉంచారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సైన్యం కవాతు నిర్వహించింది. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది పాల్గొంటున్నారు.

మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న (53 శాతం మంది) మెయిటీ తెగవారిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఏటీఎస్‌యూఎం రాష్ట్రంలోని మొత్తం 10 జిల్లాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. బుధవారం వేలాది మంది గిరిజనులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా మణిపూర్ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మెయిటీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు.

Updated Date - 2023-05-04T18:45:27+05:30 IST