Karnataka tussle: సిద్ధరామయ్యకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన డీకే శివకుమార్.. సోనియా మాటలను గుర్తుచేసుకుని...

ABN , First Publish Date - 2023-05-16T12:27:39+05:30 IST

కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై (Karnataka CM Tussle) ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి సీఎం అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తూనే ఉంది...

Karnataka tussle: సిద్ధరామయ్యకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన డీకే శివకుమార్.. సోనియా మాటలను గుర్తుచేసుకుని...

బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై (Karnataka CM Tussle) ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి సీఎం అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. సీఎం పదవి రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించాలనే పార్టీ అభిప్రాయాలను డీకే శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తన చర్యల ద్వారా స్పష్టమవుతోంది. సోమవారం ఢిల్లీకి రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా ఆయన డుమ్ముకొట్టారు. కడుపునొప్పితో బాధపడుతున్నానంటూ తన అలకను వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్ధతు తనకే ఉందంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యానించడంపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘ అయితే, అయనకి (సిద్దు) ఆల్ ది బెస్ట్’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటకను మీరు అందించగలరని నాకు నమ్మకం ఉందంటూ సోనియా గాంధీ నాతో చెప్పారు. ఇక్కడే (కర్ణాటక) ఉండి ఎప్పటిలాగానే నా బాధ్యతలను నిర్వర్తించాను. మరి కనీస మర్యాద, కొంచెమైనా కృతజ్ఞతాభావం ఉండాలి కదా. విజయం వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనీస మర్యాదకైనా గుర్తించాలి కదా’’ అని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే పేర్కొన్నారు. ‘మరి మీ చర్యలను తిరుగుబాటుగా భావిస్తే’ ఎలా అని ప్రశ్నించగా... ‘‘ నేను బ్లాక్ మెయిల్ చెయ్యను. అలాంటివాడిని కాదు. ఏమీ ఊహించుకోవద్దు. నాకంటూ సొంత ఆలోచన ఉంది. చిన్న పిల్లాడిని కాదు. నేనేమీ ట్రాప్‌లో పడను’’ అని సమాధానమిచ్చారు. సీఎం అభ్యర్థి కోసం అధిష్ఠానం కసరత్తు చేస్తున్న వేళ డీకే వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు డీకే సుముఖంగా లేరని స్పష్టమవుతోంది.

కాగా సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతోపాటు ఇతర నాయకులను సోమవారం సాయంత్రం కలవాలని ప్రయత్నించారని, కానీ సాధ్యపడలేదని ఆ పార్టీ సీనియర్ రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు డీకే శివకుమార్ మంగళవారం(ఈరోజు) ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రానికి సీఎం ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-05-16T12:34:08+05:30 IST