Share News

Assam-Mayanmar: చిచ్చు రేపిన సిబల్ వ్యాఖ్యలు..విరుచుకుపడిన సీఎం

ABN , First Publish Date - 2023-12-09T15:07:26+05:30 IST

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం ఒకప్పుడు మయన్మార్‌లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదన్నారు.

Assam-Mayanmar: చిచ్చు రేపిన సిబల్ వ్యాఖ్యలు..విరుచుకుపడిన సీఎం

డిస్పూర్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himata Biswa Sarma), రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం (Assam) ఒకప్పుడు మయన్మార్ (Mayanar)లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని, చారిత్రక వాస్తవాలను ప్రస్తావించేటప్పుడు తగినంత అవగాహన లేకుండా మాట్లాడరాదని హితవు పలికారు.


సిటిజన్‌షిప్ యాక్ట్-1955లోని సెక్షన్ 6A చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా కపిల్ సిబల్ తాజా వ్యాఖ్యలు చేశారు. 1824లో ఈ భూభాగాన్ని బ్రిటిష్ స్వాధీనం చేసుకుందని, ఒక ఒప్పందం ద్వారా అసోంను బ్రిటిషన్ వారికి అప్పగించారని చెప్పారు. ఆ తర్వాత జరిగిన బెంగాల్ విభజనకు ముందు ఈస్ట్ బెంగాల్ (బంగ్లాదేశ్) ప్రాంతంతో ఈ భూభాగానికి సంబంధం ఉండేదన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమవలసదారుల ప్రవేశాన్ని పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ ద్వారా చట్టబద్ధం చేసినట్టు వివరించారు. ప్రజలు, జనాభా వలసల గురించి చరిత్రలో ఉందని, అయితే ఎక్కడి నుంచి వలస వచ్చారో అన్నది మ్యాప్ చేయలేదని అన్నారు. అసోం చరిత్రను పరిశీలిస్తే ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారనేది గుర్తించడం అసాధ్యమని కపిల్ సిబల్ తన వాదన వినిపించారు.


తెలియకుండా మాట్లాడొద్దు: హిమంత్ బిస్వా శర్మ

కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత్ బిస్వా శర్మ మండిపడ్డారు. ''తెలియకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. స్వల్పకాలం గొడవలు జరిగాయి. ఆ ఒక్క రిలేషన్ మాత్రమే ఉంది. మయన్మార్‌లో అసోం భాగమనే డాటా నేను ఎప్పుడూ చూడలేదు'' అని ఆయన అన్నారు. చారిత్రక సంక్లిష్టతలను గుర్తు చేసుకోవాలని, మయన్మార్‌లో అసోం భాగమనే వాదనను చారిత్రక రాకార్డులు సమర్ధించవన్నారు. సున్నితమైన చారిత్రక అంశాలను ముఖ్యంగా ప్రాంతీయ చరిత్రలపై చర్చించేటప్పుడు ఖచ్చితత్వాన్ని పాటించాలని హితవు పలికారు.

Updated Date - 2023-12-09T15:07:28+05:30 IST