Gujarati 'Thug' remark: గుజరాతీ 'మోసగాళ్ల' వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు

ABN , First Publish Date - 2023-08-28T20:01:15+05:30 IST

గుజరాతీలపై చేసిన ఆరోపణలకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు సోమవారంనాడు సమన్లు జారీ చేసింది. ''దేశ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుజరాతీలు మాత్రమే మోగగాళ్లు'' అంటూ తేజస్వి చేసిన ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో కోర్టు ఈ సమన్లు పంపింది.

Gujarati 'Thug' remark: గుజరాతీ 'మోసగాళ్ల' వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: గుజరాతీలపై చేసిన ఆరోపణలకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav)కు అహ్మదాబాద్ (Ahmedabad) మెట్రోపాలిటన్ కోర్టు సోమవారంనాడు సమన్లు(Summons) జారీ చేసింది. ''దేశ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుజరాతీలు మాత్రమే మోగగాళ్లు'' అంటూ తేజస్వి చేసిన ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో కోర్టు ఈ సమన్లు పంపింది. సెప్టెంబర్ 22న కోర్టు ముందు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.


అహ్మదాబాద్‌కు చెందిన 69 ఏళ్ల సామాజిక కార్యకర్త, వ్యాపారి హరేష్ మెహతా చేసిన ఫిర్యాదు మేరకు తేజస్విపై ఐపీసీలోని 499, 500 సెక్షన్ల కింద క్రిమినల్ పరువునష్టం కేసు నమోదైంది. గత ఏడాది మార్చి 21న మీడియాలో తేజస్వి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో కూడిన సాక్ష్యాన్ని మెహతా కోర్టుకు సమర్పించారు.


తేజస్వి ఏమన్నారు?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ఉన్న రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్)ను ఇంటర్ పోల్ ఉపసంహరించుకోవడంపై గత మార్చిలో తేజస్వి విమర్శలు గుప్పించారు. ''ప్రస్తుత పరిస్థితులు చూస్తే గుజరాతీలు మాత్రమే మోసగాళ్లు, మోసం చేసినా వాళ్లను క్షమించేస్తున్నారు. వాళ్లు ఎల్ఐసీ, బ్యాంకుల డబ్బులు తీసుకుని పారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?'' అని తేజస్వి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మెహతా తన ఫిర్యాదులో తప్పుపట్టారు. తేజస్వి మీడియా ముందు చేసిన 'మోసగాళ్ల' వ్యాఖ్యలు గుజరాతీలపై బురద చల్లేలా, అవమానించేలా ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల గుజరాతీయేతరులు తమ ప్రాంతాల్లోని గుజరాతీలను మోసగాళ్లుగా చూసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తేజస్వి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గరిష్ట స్థాయిలో శిక్ష వేయాలని కోర్టును కోరారు.

Updated Date - 2023-08-28T20:10:31+05:30 IST